పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 357

ననుచు వారింప విన కది యతనిఁ గూడి
యరిగెఁ దెగియించి నిర్భరసురతవాంఛ. 499

శా. ఆరీతిం బహుదేశము ల్గడచిపో నారాధ్యుఁ డాత్మాంగనం
గారాము ల్దలపోసి యొక్కయెడ నిక్కట్టైనచో దానినా
నారత్నోజ్జ్వలభూష లూడ్చికొని యానందంబుతోడం బురిం
జేరెం దచ్చపలాక్షియు న్వగవఁజొచ్చెం గార్య మిట్లౌటకున్. 500

తే. వింటివా విక్రమార్క యవ్వెలఁది సేయఁ
దగనికార్యం బొనర్చి దుర్దశఁ గృశించె
గాన నన్యుల నడుగఁగా రానిమీన
హాసహేతువు మఱినీవె యరసికొనుము. 501

చ. తెలియఁగ జాలకున్న వచియించెద ఱేపని యింటికేగె న
చ్చెలువ యటంచుఁ దేనియలు చిల్కఁగఁ జిల్క వచింప నంతలో
బలబల వేగవచ్చినఁ బ్రభావతి కేళిగృహంబుఁ చేరి చం
చలమతి నాఁటిరేయి నృపచంద్రుని పొందిక గోరి చేరినన్. 502

తే. చిలుక వీక్షించి కలదు విచిత్రగాథ
యది యగాధసరోజరాగాధరోష్ఠి
యనుచు వచియింపఁ దొడఁగె భాష్యార్థమాన
మాధురీమాధురీణత సాధురీతి. 503

తే. చేరి యెన్నికథలు చెప్పినఁ గనలేక
విక్రమార్కధరణివిభుఁడు పిలువఁ
బనుపనేగి మంత్రితనుజాత తత్సభా
ప్రాంగణమునఁ దెరమఱుంగుఁ జెంది. 504