పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxii

ఆచతుర వచ్చినవాని నోరు తెరువనీయకయే మీఁదమీఁద ఇన్ని కొట్టిపెట్టినది! కవి వర్షర్తువును వర్ణించినా “గొంగడిముసుగుతో గొల్లలు చట్రాతిపై ని బందారాకుపరిచికొనగ" అనును. రాటమును వర్ణించినప్పుడు దానియంగాంగములన్నియు తెలుపును, మద్యపానమునకై వెళ్లువారు "తమ మునిచెరగులందు గాసుదుడ్డును బంగారుపూస వెండి తునక, మొదలింటిచిరువాడు గొనిన దెల్ల గొచుచు" వెళ్లిరనును. సంక్రాంతిని వర్ణించుచో “ఇంక నాల్గావంబు లిడనైతి గాయంచు గుమ్మరి నెమ్మది గుందికొనగ" అనును.

5. స్వాభావికవర్ణనలు:-కవిలోకానుభవము అతని వర్ణన లందంతటను వ్యక్తమగును. తనకథలలో కొరవంజిని, రెడ్డిని, తురకజవానును, చాకలిని, జెట్టిని, గోమటిని, పురోహితుని, గొల్లను, జోగురాలిని, బోగముదానిని మున్నగువారిని వారివ్యక్తిత్వమున కేలోపమును గావింపక వారిభూషణములను, వస్త్రములను, కట్టు, బొట్టు, వేషాదులను సమగ్రముగా వర్ణించి మనకు ప్రత్యక్షముగాఁ గనిపించునట్లు చేయును. కవికాలమందు తెనుఁగుదేశము గోలకొండ సుల్తానుల వశమయ్యను. అందుచే తెనుఁగుదేశమందు తుకజవానులు జనులను భయపెట్టి జీవించెడివారు. ఒక జవానును కవి యిట్లు వర్ణించెను.

సీ. మెలిపెట్టి చుట్టిన తెలిఫరంగిముడానుపై, లపేటాడబ్బుపనులు జెలఁగు
    బంగరువ్రాఁతలపట్టుహిజారు, కం, బరుచీనినిమతాని పాడు నొసలు
    తనుకాంతి గనుపింప దలిరు నంగీజోడు, వలిపెంపు శాలువ వల్లెవాటు
    బడుదలలోన డాబాకత్తివదలుపా, పోనులు గోరంట బొలుచుగోళ్లు
    నడుమసీలున్నతోలు డాల్బెడగుసూప
    నభయముగ వెంట నరుదెంచు నభరువాఁడు