పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160 శుకసప్తతి

కును మాకును బంధుత్వం
బనుతరమై బ్రహ్మనుండి యమరినదరయన్. 164

క. అని యనియు ననకమునుపే
యనఘా యే బ్రతికితిని మదన్వయ మిది పా
వనమయ్యె ననుచు నవ్వటుఁ
డనితరగతిఁ దత్పదద్వయంబున వ్రాలెన్. 165

తే. అతఁడును బొంతనము లెల్ల నరసి లెస్స
యున్నవని పల్కి యారేయి యొక్కలగ్న
మేర్పఱచి యిరుగుపొరుగు నెఱుఁగకుండఁ
దనతనూభవ నతనికి ధారపోసె. 166

ఉ. అంతట దాని పేరు విని యల్లుఁడు మెల్లన మామగారి నే
కాంతమునందుఁ జేరి వినయంబున నీయభిధాన మెట్టు లీ
కాంతకుఁ గల్గెఁ దెల్పుమనఁగా విని యాతఁడు దానిపూర్వవృ
త్తాంతముఁ దెల్పి దీనిఁ జెడుగై పడనీయక కాచికొమ్మనన్. 167

తే. మంచిదని నాగవల్లట మించినపుడె
యాలిఁ దోడ్కొని తనయగ్రహారమునకు
బోయి తనగృహమధ్యంబు పోతుటీఁగ
కైన బొలయక యుండంగ నలవరించి. 168

క. తలయంటు నలఁగుఁబెట్టున్
జలకములార్చు న్మెఱుంగుచలువలు గట్టుం
దిలకంబుదీర్చుఁ గలపం
బలఁదుం గోవిందుఁ డయ్యొయారికి దినమున్. 169