పుట:శివతత్వసారము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ కాలముననే కర్ణాట దేశమున శ్రీ బసవేశ్వరు డను మహానుభావుడు వర్ధిల్లెను. బసవేశ్వర సంప్రదాయమున అబ్రాహ్మణులు లింగధారణము చేయుదురు. వారు లింగాయతులు. బసవేశ్వర శిష్యులకు వేదాదుల యెడ ప్రమాణబుద్ధి లేదు. వారికి శివభక్తియే ప్రధానము, ఆంధ్రదేశమున జంగము లిట్టివారే.

సహజముగా శివభక్తు డైన పండితుని యాచారములను నాటిస్మార్తులు ఆక్షేపించినట్లు తోచును. తేజస్వి యగు పండితుడు ఉద్దీపుడై వీరభావము వహించి క్రమముగా వీరమాహేశ్వరు డయ్యెను.

వైదికమగు శివభక్తియు, పౌరాణిక మగు శివభక్తియు కలవు. వానికిని వీరమాహేశ్వరమునకును భేద మున్నది. శివారాధకులలో కొందఱు శాంతచిత్తులు, కొందఱు ఉగ్రులు కలరు. శాంతచిత్తు లగు వారి సిద్ధాంతములు, సాధన ప్రణాళికలు మృదువుగా నుండును. ఉగ్రు లగువారి విధానము లుగ్రములే.

శివతత్త్వము మహోన్నతము. అతిప్రాచీనకాలమునుండియు శివమూర్తిని లింగరూపమున అనేకు లర్పించుచున్నారు. విభూతి, రుద్రాక్షలు, బిల్వపత్రములు శివభక్తులకు ప్రీతిప్రదములు. పంచాక్షరీమంత్రము అత్యంతపవిత్రము.

ఈ గ్రంథమున శివపారమ్యము చెప్పబడినది. మంచిదే! కానీ ఈకవి అద్వైతపరము లైన వేదవాక్యములకు ద్వైతపరముగా అర్ధము చెప్పుట సంభవించినది. వీరు లగువారు శివుడు తప్ప అన్యదైవతము పేరు వినరు. శివమహిమకన్న వీరికి అన్యముండరాదు. శివారాధన వలననే జనులు ముక్తులగుదురు అని వీరి విశ్వాసము.

ఇందు శివనిందకుల సంహారము చెప్పినను, బసవపురాణమున కొందరు శివభక్తులు ధవులను (శైవులు కాని వారిని) వధించిన కథ లున్నను ఆ తరువాతి కాలమున వీరశైవు లిట్టివి సమ్మతించలేదు. కానీ శివునికై మృతినొందు వానికి ప్రేతకర్మలు చేయ నక్కరలేదు. బందుగులకు సూతకము లేదు. అట్టివాని మృతికై పండుగ చేసికొనవలెను. శివనిర్మాల్యము శివదీక్షితుడు తప్ప అన్యులు భుజింపరాదు.