పుట:శివతత్వసారము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితు డిట్టివానిని ప్రతిపాదించుటకు కారణము లేమి? అతడు మహానుభావుడు, శివభక్తిపరాయణుడు, శివునికన్న అన్యమును పూజించినచో ముక్తి యుండదని విశ్వసించినవాడు. ఆయన జన్మను బట్టియు, శిక్షణను బట్టియు ఆయన కాలమున వర్తిల్లిన మతములను బట్టియు మనోవేదన కలిగి భక్తిభరితహృదయుడై లోకానుగ్రహబుద్ధితో జనసంతరణార్ధము గాఢమైన ప్రణాళిక నిర్ధారించినట్లు కానవచ్చును. ఏపని చేసినను ఆయన శివప్రీతికే చేసెను. స్వయముగా సమస్తమును శివమయముగా భావించువాడు జనులలో పరినిష్ఠితబుద్ధి ఏర్పడుటకై గట్టిచట్టము ఏర్పరచినాడు. ఈ కావ్యమున అన్యమతవిరుద్ధముగా కానబడు తీవ్రవాక్కులను యథాతథముగా స్వీకరింపక, "శివః సత్యం' అను సిద్ధాంతమునకు సర్వజనులను ఉన్ముఖులను చేయుటకై ప్రవచించినట్లు భావించుట యుక్తము. బాహ్యరూపమున వక్కాణించిన వాక్కులకన్న అంతర్గతసత్యమే అత్యంతప్రధానమని గ్రహింప నగును,

ఈకావ్య మసమగ్రముగా నుండుట శోచనీయము. ఇది పద్యరూపమున, అందును కందపద్యముగా నడచుట పఠన పాఠనములకు యోగ్య మగు ననియు, స్మరణకు సులు వనియు ఆయన తలచియుండును. అన్యవాద, మతధిక్కరణము నేటికిని కొందరు, కొందరు తత్త్వవేత్తలు చేయుచున్న పనియే. భక్తుడగువాడు అద్వైతము నంగీకరింపలేడు. భక్తస్థితిలో నున్నవా రెల్లరును ద్వైతులే. ధర్మముకన్నను ద్వైతులకు భక్తియే ప్రధాన మగుటచే కొన్ని యెడల భక్తి పక్షపాతమున విచిత్రకార్యములను ఉపపాదింప వలసి వచ్చును. అన్నిటిని సక్త్రమముగా గ్రహించి సమన్వయము చేసికొని పఠితలు ప్రమోదము చెందుట ప్రశస్తము. నమః పార్వతీ పతయే!

ఇతి శివమ్!

స్వామి శ్రీ శివశంకరస్వామి
తీర్థాశ్రమము - ఒంగోలు