పుట:శివతత్వసారము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః
ప్రబల తపసే తత్సంహారే హరాయ నమో నమః
జనసుఖకృతే సత్త్వైస్థిత్త్యై ప్పరాయ నమో నమః
ప్రమహసిపదే నిస్త్రైవణ్యే శివాయ నమో నమః.

శివతత్త్వసారము అసాధారణగ్రంథము. క్రీ.శ.12 శతాబ్దిలో ఈ కావ్య ముద్భవించినది. ఆనాటి స్థితిగతులను బట్టియు, తత్పూర్వము శైవమున ప్రవర్తిల్లిన వివిధసంప్రదాయములను బట్టియు, మల్లికార్జున పండితుడు దీనిని రచించుట సంభవించినది. తత్పూర్వము కాలాముఖ, కులీక, త్రిక సంప్రదాయములు ప్రవర్తిల్లినవి. పండితునకు వానియెడ నసంతృప్తి కలిగియుండును. అంతియేకాక నాటి బౌద్ధ జైననమతములు వైదిక కర్మలు అద్వైతుల విధానములు, ఆయనకు విరుద్ధముగా తోచియుండును. కావుననే పండితుడు కొందఱను వాదములో జయించుటయు, కొందఱి సిద్ధాంతములను ఖండించుటయు తటస్థించినది.

మల్లికార్జున పండితు డసామాన్యవ్యక్తి. శ్రీశైలమల్లికార్జునదేవుని యనుగ్రహమున జన్మించినాడట. శ్రీమహేశ్వరుడే ఆయనను భూలోకమునకు బంపి నూతనశైవసిద్ధాంతప్రతిపాదన చేయు మన్నట్టు ప్రతీతి. పండితుడు కోటిపల్లి క్షేత్రములో జన్మించి ఆరాధ్యదేవుని శిష్యుడై గురువుకడ శైవదీక్ష పొంది, శైవమతరహస్యములు గ్రహించినాడు.

పండితుడు ఆంధ్రదేశమున ఆరాధ్యసంప్రదాయస్థాపకుడు. ఆయన వేదశాస్త్రములు పఠించినవాడు. కావుననే ఆరాధ్యులకు శ్రుతిస్మృతులందు ప్రమాణబుద్ధి కలదు. గృహ్యసంస్కారములను వారు వేదోక్తముగానే నడపుదురు. అంత్యసంస్కారములను ఆబ్దిక శ్రాద్ధమును మాత్రము ఆగమోక్తముగా జరుపుదురు. వీరు కులభేదము పాటింతురు, ఆంధ్రదేశమున ఆరాధ్యులు లింగధారణము చేయుదురు.