పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అందు శుకివలన శుకంబులును, ఉలూకివలన నులూకంబులును, శ్యేనివలన
శ్యేనంబులును, భాసివలన భాసిపక్షులు, గృద్ధివలన గృధ్రంబులును, శుచి
వలన నుదకపక్షిగణంబులును, సుగ్రీవివలన నశ్వోష్ట్రగర్దభంబులునుం
బుట్టె.

663


క.

వినతకు నిద్దఱుపుత్రులు, ఘనతేజుం డరుణుఁ డనఁగ గరుడుఁ డనంగా
జనియించి రందు గరుడుం, డనివారణపన్నగాశనాఖ్యం బరఁగెన్.

664


వ.

సురసకు అమితౌజస్కంబును, ననేకశిరస్కంబును, ఖేచరంబును, మహాత్మ
కంబును నగు సర్పసహస్రంబు పుట్టె. కద్రువకుఁ దేజోబలసంపన్నంబులు ననేక
మస్తకంబులు నగు సర్పంబులు సహస్రంబు పుట్టె. సుపర్ణునకు వశవర్తులయ్యె.
అందుఁ బ్రధానసర్పంబులు శేష, వాసుకి, తక్షక, శ్వేత, మహాపద్మ, శంబర,
అనృతక, కర్కోటక, ధనంజయులు నాదిగాఁ గల విషోల్బణదందశూకంబులు
పెక్కు గలవు, మఱియు సురభివలన స్థలజంబులు, జలజంబులు, దారుణంబులు
పిశితాశనంబులు నైన పక్షిగణంబులు పుట్టె. ఇలవలన వృక్షలతాతృణజా
తులు పుట్టె. ఘషవలన యక్షరక్షోగణంబులు పుట్టె. మునివలన నప్సరోగణంబులు
పుట్టె. అరిష్టవలన మహాసత్వులైన గంధ్వరులు పుట్టిరి. స్థావరజంగమంబులైన
వీరందఱు కశ్యపదాయాదు లనంబరఁగుదురు. ఏతత్పుత్రపౌత్రపరంపర య
సంఖ్యంబై ప్రవర్తిల్లు. ఇది స్వారోచిషమన్వంతర సర్గంబు. వైవస్వతమన్వంత
రంబున వరుణయాగంబునందు వేల్చు ప్రజాపతికిఁ బ్రజాసర్గంబు కలిగెనని
చెప్పంబడు పూర్వసర్గంబున సువర్ణాఖ్యులగు సప్తర్షుల నిసర్గంబు మానసపుత్రు
లంగాఁ గల్పించి పితామహుండు గంధర్వ, భోగి, దేవ, దానవుల నట్ల కల్పించె.

665


క.

కొడుకులపని యీవిధమునఁ, గడతేరుట చూచి దితియుఁ గశ్యపమౌనిం
గడువేడ మెచ్చి యతఁ డో, పడతుక నీయిష్ట మేమి పలుకుమనుటయున్.

666


గీ.

పాకశాసను వధియించుపాటిపుత్రు, నొసఁగుమనుటయు నతఁడు నయ్యుత్పలాక్షి
కోరువర మిచ్చిపల్కె నోకీరవాణి ఘనశుచిక్రియ నూరేండ్లు గర్భ మీవు.

667


క.

ధరియించితేని యింద్రుని, బరిమార్పఁగఁ జాలునట్టి పట్టి భవద్భా
సురకుక్షిఁ బుట్టునని ముని, యరిగెన్ గర్భంబు దాల్చె నతివయు శుచియై.

668


చ.

అమరవరేణ్యుఁ డింతయు నిజాత్మగతంబునఁ గాంచి పోయి యా
యమ కతిభక్తి సేవ వినయంబునఁ జేయుచుఁ గాచియుండఁగాఁ
గ్రమమునఁ గించిదూనమయి కాలము వచ్చిన నొక్కనాఁడు పా
దముల నశౌచయై శయనధామమునం దితి నిద్ర వోయినన్.

669