పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

కండుమునియును నప్సరఃకాంతకతనఁ, గూర్చిన తపోధనంబెల్ల కొల్లఁబోవ
తల్లడము నంది యధికసంతాసతప్త, చిత్తుఁడై దాని నిష్కృతి చేయఁబూని.

450


సీ.

ఆమ్నాయనివహంబు లందంద వందులై పొగడు నేక్షేత్రంబు భూరిమహిమ
గీర్వాణవితతు లేక్షేత్రంబు జనుల నారూఢిఁ గన్గొను చతుర్భుజులు గాఁగఁ
గీర్తించునంత నేక్షేత్రంబు కోటికోట్యయుతజన్మాఘంబు లడఁగఁజేయు
శ్రీసతీపతికి నేక్షేత్రంబు దేహమై తనరు కల్పాంతరస్థాయి యగుచు


గీ.

పతితపావనతాఖ్యాతిఁ బ్రబలుచుండు, భూమి నేక్షేత్ర మట్టి శ్రీపూరుషోత్త
మాహ్వయక్షేత్రమున కేగె నతితపస్స, మిద్ధరుచిహేళి కండు మునీంద్రమౌళి.

451


ఉ.

ఉత్కళికన్ మునిప్రవరుఁ డుబ్బుచు, గొబ్బునఁ జేరె భారతీ
యోత్కలసీమ దక్షిణమహోదధితీరమునందు సర్వసం
పత్కరమై విముక్తులకుఁ బట్టగు శ్రీపురుషోత్తమంబు సం
విత్కలనానిరూఢి నవివిశ్రుతుఁడై యతఁ డాక్షణంబునన్.

452


సీ.

కమలాక్షచక్రనిఖాతమార్కండేయకుండోదకంబునఁ గ్రుంకు లిడియె
తురగమేధీయబంధురగవిఖురదీర్ణసమధికేంద్రద్యుమ్నసరసిఁ దోగె
కాకమోక్షప్రదకారణాంభఃపూర్ణరోహణపావనోర్ముల మునింగె
దర్శనమాత్రఁ బాతకవిదారణచణాంచితతీర్థరాజవీచికలఁ దేలె


గీ.

శ్వేతరాజతపస్తుంగ శ్వేతగంగ, సంగముల దోచె కోటిజన్మార్జితాఘ
పుంజముల నొక్కవ్రేల్మిడి పొల్లు చేసి, మహితసద్గుణశాలి యమ్మౌనిమాళి.

453


వ.

ఇట్లు శ్రీపురుషోత్తమదివ్యక్షేత్రంబునకు భూషణీభూతంబైన తీర్థజాతంబునం
గృతస్నానుండై పుండరీకాక్షకృపాకటాక్షవీక్షేక్షుసారఝరీపరంపరలు
దార్కొని పేర్కొని కరడుగట్టి గట్టిగా కనుపట్టి పంచదారగట్టనం బట్టుగల
దట్టంపుప్రాసాదవజ్రదీధితిధట్టంబులు చుట్టుకొన్న మిన్నందియున్న శ్రీనీల
మహీధరం బధిరోహించి నేత్రపర్వంబులగు ద్వావింశత్పర్వంబులు గడచి
చని దివ్యప్రాసాదమధ్యగతవిచిత్రరత్నసింహాసనోపరిభాగంబున.

454


సీ.

అంజనాచలకాంతిభంజనాచలతనుచ్ఛాయ లెల్లెడలకు జౌకళింప
పద్మసౌందర్యైకసద్మసౌభాగ్యాకరాయితేక్షణరుచుల్ హర్ష మొసఁగ
మేరుకూటోదారభూరిరత్నస్ఫారమౌళిద్యుతులు నభోమార్గ మలమ
బాలాతపోద్దామలీలారుచిరహైమచేలాభ లంతట జికిలి చేయ


గీ.

సుకరసంవాసితదరారి సుకరవికచ, చకచకలు పేరెములఁ దొక్క చక్కఁదనపు
రాశియైయున్న శ్రీసుభద్రాసనాథు, శ్రీజగన్నాథుఁ గనియె నాసిద్ధమాని.

455