పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సత్కవీంద్రులు తమవచశ్చతురిమములు, చూప నూరకె బ్రమసి సంక్షోభ మంది
వందురుటగాక తెలిసిన వాస్తవమున, వారిజాక్షులు జంగమనారకములు.

441


ఉ.

ఏతఱి సత్కులప్రభవుఁ డేవము లేక విహీనుఁడై త్రపా
పేతమనస్కుఁడై యకట యేగతి ముద్దిడు వాఁడు కష్టదు
ర్జాతవిదూషకాల్పనటజారభుజంగకచోరకోటిని
ష్ట్యూతశరావమైన వెలయుగ్మలిమోవి వసుంధరాస్థలిన్.

442


సీ.

విధ్యుక్తిసాంగమౌ వేదప్రపంచంబు, చదివి యత్యంతప్రశస్తిఁ గాంచి
మానక యుభయమీమాంసాపరిశ్రమ, ప్రమనస్త్వమునఁ గీర్తి పరిఢవించి
సిద్ధాంతసంసిద్ధి చిదచిదీశ్వరవిని, ర్ణయవివేకనిరూఢి జయము గాంచి
అలయక బహుళేతిహాసపురాణార్థ, వైదుష్యమునఁ జాలవన్నె కెక్కి


గీ.

పిదప నీరీతి చదివినచదువులెల్లఁ, జిలకచదువులు చేసి దుశ్శీలలీల
లోలనయనావిలోకనాభీలజాల, వినిహతిమృగంబు నైతి నే మనఁగఁ గలదు.

443


చ.

అని తను రోసి రేచి జలజాయతలోచనమోముఁ జూచి య
మ్ముని యను పాపజాతి నను ముంచితి వీకలుషాబ్ధిలోన న
య్యనిమిషనాథుకార్యమునకై చను మెక్కడికైన నీవు వ
చ్చినపని దీరెఁ గోపశిఖిచే నిను నేర్చెద నిల్చియుండినన్.

444


వ.

మఱియు నొకవిశేషంబు చెప్పెద. సఖ్యంబు సాప్తపదీనంబని చెప్పుదురు,
బహుకాలంబు నీతోడం గూడియుండి నిన్ను దండింపరాదు గావున.

445


క.

నిను గినియ నేమి యింద్రుని, ననఁ గారణ మేమి ఘనవిషాభవిషయవా
రనుపమవననిధివీచుల, మునిగిననను దిట్టఁ దగవు మూర్ఖుఁ డనగుటన్.

446


వ.

అని యమ్ముని యధిక్షేపించి కించిదరుణాయమాననేత్రాంచలుండై పెచ్చు
పెఱిగి రెచ్చి పలికిన ఱిచ్చవడి యయ్యచ్చర యచ్చెరుపాటునఁ దొటతొటం
దొరగు చెమటచిత్తడిం దడిసి వడవడ వడఁకు నవయవంబులు ముంచిన రోమాం
సంచయంబునన్ కంచుకితయై సంచరించి జవంబున దివంబునకుఁ బోవు
నప్పుడు.

447


క.

అమ్మునిపతితేజము, గర్భమ్మయి స్వేదమునఁ గలిసి స్రవియించిన న
క్కొమ్మయుఁ దరుపల్లవముల, సమ్మదమునఁ దుడిచివేసె శాఖలమీదన్.

448


క.

మారుత మేకము చేసిన, నారీమణి యయ్యె వినుము నాకును ప్రమ్లో |
చారమణికి మునిపతికిని, మారుతవృక్షముల కిది కుమారిక యయ్యెన్.

449