Jump to content

పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఈరాజాసనంబు సామ్రాజ్యచిహ్నం బిది నాపుత్రునకే యోగ్యం బేల క్లేశ
పడియెదవు? సునీతికిం బుట్టిననీ కుచ్చైర్మనోరథంబులు సిద్ధించునే యని యధి
క్షేపించి పలికిన నప్పుడు.

262


క.

ధ్రువుఁ డవిరళతరకోపో, ద్భవుఁడై యచ్చోటు వాసి తనునొందుపరా
భవము తనతల్లి కెఱిగిం, చ వడిం దద్గేహమునకుఁ జయ్యనఁ బోయెన్.

263


క.

పరిభవపీడితు నీష, త్స్ఫురితాధరుఁ దనయు నపుడు చూచి జనని యా
దరమున నంకస్థలి నిడి, శిర మాఘ్రాణించి యనియెఁ జిత్తము చెదరన్.

264


సీ.

అన్న యేటికి విన్ననైనది నీమోము? కోపకారణ మేమి? చాపలమున
నెవ్వరైనను బతి కెగ్గు కావించిరో? నీ కెగ్గు చేసిరో? శోక మేల?
అనుటయు సురుచి త న్నవమానవాక్యముల్ గర్వించి పలికినక్రమము చెప్ప
వెండినిట్టూర్పు బల్విడిపుచ్చి దుశ్చిత్తమున దీనవసినయై తనయుఁ జూచి


గీ.

అల్పఫణితి సునీతి యిట్లనియె సత్యమయ్య తద్వాక్య మట్ల భాగ్యంబు లేని
నాకు నుదయించి నికృతిసంతాపజలధి మునుగఁ బాలైతి వింక నేమనఁగఁగలదు.

265


చ.

సురుచి పురాభవంబున విశుద్ధతపంబులు చేసియుండ భూ
వరుఁడు తదీయకార్యవశవర్తనుఁ డయ్యె నపుణ్యకర్మదు
స్తరపరిభావవారినిధి సాంద్రతరంగనిమగ్న యైనసుం
దరి ననుబోటి భార్యయను నామమె తాల్చు విహీనభాగ్యతన్.

266


ఉ.

అన్న! పురాభవాంతరసమార్జితకర్మచయంబు పాకమై
నన్నరు నొందు నెందును ఘనంబుగ దుఃఖసుఖంబు లిట్లు తా
నెన్నక స్రుక్కుఁబొంగునరుఁ డెవ్వఁ డతండు వివేకపాపసం
పన్నతలేనివాఁ డనుచుఁ బల్కుదు రాగమతత్వకోవిదుల్.

267


వ.

రాజాసనఛత్రచామరాశ్వవారణాదులు పుణ్యంబు లేనివారికిం గలుగవు.
పుణ్యవతియైన సురుచికడుపునం బుట్టుటం జేసి యుత్తమునకుం గలిగె నల్ప
పుణ్యనైన నాకడుపునం బుట్టిననీ కేల కల్గు నెవ్వరి కేమి గల్గు వారందుచేతఁ
దృప్తింబొందవలయునని యుపశమించుము. కాకున్ననట్టిమహోన్నతపదం
బులు లభించుటకై సర్వఫలప్రదుండైన దామోదరు నాశ్రయించి పుణ్యో
పచయార్థంబు యత్నంబు చేయుము. సుశీలుండవై ధర్మాతుండవై సర్వ
భూతహితరతుండవై సర్వమిత్రుండవై వర్తిల్లుము. ఉదకంబులు పల్లంబున
కోడిగిలినట్లు సంపదలు పాత్రంబు వెదకి పొందునని చెప్పిన సునీతికి ధ్రువుం
డిట్లనియె.

268