పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రుండును నన ముగ్గురు పుత్రులు పుట్టిరి. పులస్త్యునకు ప్రీతియను కాంతవలన
దత్తుండు పుట్టె; నతండు పూర్వజన్మంబున స్వాయంభువమన్వంతరంబున నగ
స్త్యుం డనంబరగు. పులహునకు క్షమయనుభార్యయందుఁ గర్దముండును
ఊర్వతీయుండును సహిష్ణుండు నను సుతత్రయంబు పుట్టె. క్రతువునకు సన్నతియను
భార్యయందు ఊర్థ్వరేతస్కులును నంగుష్ఠపర్వమాత్రులును జ్వలద్భాస్కర
తేజులునగు వాలఖిల్యు లరువదివేలు పుట్టిరి. వసిష్ఠునకు ఊర్జయందు రజుండును
గాత్రుండును ఊర్ధ్వబాహుండును సవనుండును అనఘుండును సుతపుత్రుం
డును శుక్రుండును నన నేడ్వురుఋషులు పుట్టిరి.

256


గీ.

అరయ నగ్న్యభిమాని బ్రహ్మాగ్రసుతుఁడు, పావకుఁడు స్వాహాయను తనభార్యయందు
వినుము! పవమానశుచిజలాశను లనంగ, సుతుల మువ్వుర గనియె నూర్జితమతులను.

257


వ.

వారలసంతతి పంచచత్వారింశద్భేదంబులం బరఁగె. పావకుండును పుత్ర
త్రయంబునుం గూడ ఏకోనపంచాశద్భేదంబుల వహ్నులఁ గీర్తింపంబడుదురు
బ్రహ్మకు నగ్నిష్వాత్తులును, బర్హిషదులును ననుపితరులు పుట్టిరి; వా రనగ్నులును,
సాగ్నులునునై యుండుదురు. వారలు స్వధయను భార్యయందు మేనయు,
వైధారిణియు నను గన్యలం గనిరి. వారిరువురు బ్రహ్మవాదినులును యోగినులును
ఉత్తమజ్ఞానసంపన్నలును సకలగుణాన్వితలునునై యుండుదురు. ఇది దక్ష
కన్యకాసంతానవృత్తాంతంబు. ఇది శ్రద్ధావంతులై వినువారు పుత్రపౌత్రాభి
వృద్ధు లగుదురని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

258

ధ్రువచరిత్ర

సీ.

మునివర స్వాయంభువునకుఁ బ్రియవ్రతో, త్తానపాదాఖ్యు లిద్దఱుతనయులు
తనరుదు రందు నుత్తానపాదునకు సు, రుచిసునీతులు భవ్యరుచులు సతులు
సురుచిపైఁ బ్రేమ హెచ్చుగ నుంచు భూనాథుఁ డిడడు సునీతిపై నించుకైన
సురుచికి సుతుఁడు భానురుఁ డుత్తముఁడు పుట్టె వెలయ సునీతికిఁ గలిగె ధ్రువుఁడు


గీ.

నవ్యమణిహేమరాజాననస్థుఁడైన, తండ్రితొడ యెక్కి యున్నయుత్తముని జూచి
ధ్రువకుమారకుఁడును దదారోహణాభి, కాంక్షియై డాయవచ్చినఁ గాంచి సురుచి.

259


ఉ.

పాపఁడ యీవృథాశ్రమము పాల్పడనేల నృపాలకాంక మే
రూపున నబ్బు నీ కిది యెఱుంగవె మున్ను మదీయగర్భజ
న్మాపరిమేయభాగ్యదశ నంద సునీతికి నేల పుట్టి తీ
వీపతి తండ్రియైన నిది యేల లభించుఁ ద్యజించుఁ గామమున్.

260


క.

మత్తనయుఁ డుత్తముం డీ, యుత్తమపదమునకు నర్హుఁ డుడుగుము నీ వీ
యుత్తలము పుణ్యఫలసం, పత్తి న్మత్సుతుఁడవైన మఱి సిద్ధించున్.

261