పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లోపలను బూర్వోదితులగు నిద్దఱినడుమ సమంబుగా నేనక్షత్రంబు గానం
బడు దానితోఁ గూడి యాసప్తర్షులు మనుష్యమానంబున నూఱేం డ్లుండుదురు.
పరీక్షిత్తునికాలంబున సప్తర్షులు మఘానక్షత్రమున నుండుదురు. అది మొదలు
ద్వాదశాబ్దశతాత్మకంబైన కలి ప్రవేశించి యుండు.

468


చ.

నవసరసీజనేత్రుఁడు జనస్తవనీయుఁడు కృష్ణుఁ డెన్నఁ డే
దివమున కేగు నాఁడె జగతిం గలి వొందెఁ దదీయదివ్యప
ద్భవరజ మంటి మేదిని శుభస్థితి నుండెడునాఁడు చేర రా
దవిరళపాపయుక్తిగల యక్కలికిన్ మునిలోకపూజితా.

469


వ.

భగవంతుండైన పుండరీకాక్షుండు దినంబునకుం బోయిన కలి ప్రవేశించిన
తదనంతరంబ విపరీతంబులగు దుర్నిమిత్తంబులు చూచి యుధిష్ఠిరుండు పరీక్షిత్తు
నభిషిక్తుం జేసి మహాప్రస్థానంబు చేసె. ఎన్నఁడేని సప్తర్షులు పూర్వాషాఢం
బ్రవేశించెదరు నా డనందుఁడు కడచను. అచ్చటనుండి కలి ప్రవృద్ధంబగు.
అట్టి కలియుగసంఖ్య వినుము.

470


క.

అరయఁగ లక్షత్రయమును, నఱువదివేలుఁ నగు మానుషాబ్దంబులు నీ
వెఱుఁగుము కలియుగమునకున్, సరి డెబ్బదిరెండువేలు సంధ్యబ్దంబుల్

471


వ.

ఏతత్పరిణామంబగు కలియుగంబు నిశ్శేషంబైన కృతయుగంబు ప్రవేశించు.
యుగయుగంబున మహాత్ములగు బ్రాహ్మణక్షత్రియవైశ్యులు గలరు. వారికులం
బులు నామధేయంబులును ననేకంబు లగుట జేసి యెఱింగింపనైతినని చెప్పి
శ్రీపరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

472


సీ.

పౌరవవంశసంభవుఁడు దేవాపియు, నిక్ష్వాకుకులజుఁడై యెసఁగు మరుఁడు
పరమయోగాభ్యాసపరత కలాపక, గ్రామంబునం దుండి కలియుగంబు
చన్నచోఁ గృతయుగసమయంబునందు, క్షత్రప్రవర్తకు లయ్యెదరు మునీంద్ర
యుగముల మూఁటియం దుర్వి పాలింతురు, మనుతనూభవు లీక్రమంబు వెలయ


గీ.

కలియుగంబున నితరజాతులు ధరిత్రి, యేలుదురు నీకుఁ జెప్పితి నెల్లనృపుల
వంశకర్తల సంక్షేపవర్ణనమున, నంతయును జెప్ప నలవియె యజునకైన.

473


వ.

పృథివిగీతల యర్థంబు వినుము.

474


మ.

ఇది నాభూమి మదీయపుత్రకుఁడు వీఁ డేలంగలం డింకఁ జం
పెద విద్వేషులఁ దద్ధరాస్థలము పేర్మింబెంపుతో నేలెదన్
సదయం బొందెద నంచు నయ్యుగచతుష్కక్ష్మాపతిశ్రేణి దు
ర్మదమోహంబులఁ ద్రుంగెఁ గాని పరమార్థజ్ఞానిగాఁ డెవ్వఁడున్.

475