పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖ్యులు పుత్త్రులు గలిగిరి. అంధకునకుఁ గుకుర, భజమాన, శుచి, కంబల,
బర్హిషాఖ్యులు నలుగురు గల్గిరి. కుకురునకు ధృష్టుడు నతనికిఁ గపోతరోముండు
నతనికి విలోముండు నతనికిఁ దుంబురుసఖుండైన యనుండు ననునకు నానక
దుందుభి, నతనికి నభిజిత్తు, నతనికి బునర్వసుఁడు నతనికి నాహుకుండును,
నాహుకియను కన్యయుం గలిగిరి. అయ్యాహుకునికి దేవకుండును నుగ్రసేనుం
డును గలిగిరి. దేవవ దుపదేవ సహదేవ దేవరక్షితాఖ్యలు నలుగురు పుత్త్రులు
దేవకునకుం గలిగిరి. ఈనలుగురికిఁ వృకదేవ యుపదేవ, దేవరక్షిత, శ్రీ దేవ,
శాంతిదేవ, సహదేవ, దేవకి యనునేడ్వురు తోఁబుట్టిన కన్యకలు. ఈయేడ్వు
రను వసుదేవుండు పెండ్లియాడె. ఉగ్రసేనునికిఁ గంస, న్యగ్రోధ, సునా
మానక, శంకు, సుభూమి, రాష్ట్ర పాల, యుద్ధ, తుష్టి సుష్టి మత్సంజ్ఞులు పుత్త్రులు
కలిగిరి. మఱియుఁ గంస, కంసవతి, సుతనువు రాష్ట్రపాలిక యనుకన్యకలుం
గలిగిరి. భజమానునికి విదూరథుండు, నతనికి శూరుండు, నతనికి శమి, యత
నికిఁ బ్రతిక్షత్రుండు, నతనికి స్వయంభోజుండు, నతనికి హృదికుండు, నతనికిఁ
గృతవర్మ శతధను దేవార్హ దేవగర్భాదులు పుత్త్రులు గలిగిరి. దేవగర్భునకు
శూరుండు, శూరునకు మారిష యనుకాంతయందు వసుదేవాదులు పదుగురు
పుత్త్రులు పుట్టిరి. అవ్వసుదేవునిజన్మకాలంబున భగవదంశావతారంబు నిరీ
క్షించి దేవతలు దివంబున నానకదుందుభులు మొఱయించిన వసుదేవునికి
నానకదుందుభి నామంబు కలిగె. అవ్వసుదేవుని భ్రాతలు దేవభాగ దేవ
శ్రవాష్టక కకుచ్చక్ర వత్సధారక సృంజయ శ్యామ శమిక గండూష సంజ్ఞులు
తొమ్మండ్రు గలరు. పృధ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి యను
నామంబులం గలకాంతలు వసుదేవాదులకుఁ దోఁబుట్టినవారు. శూరునకుఁ
గుంతియను సఖుడు కలఁడు. అతం డపుత్రకుండై యుండ నిజపుత్త్రియైన
పృథ నతనికి విధిపూర్వకంబుగఁ బుత్త్రింగా నిచ్చె.

404


చ.

భరితయశోవిశాలుఁడగు పాండునృపాలుఁడు పెండ్లియాడె భా
స్వరకమలేక్షణం బృథ నవంధ్యత ధర్మమరున్మరుత్పతి
స్ఫురదతులప్రభావమునఁ బుట్టిరి ధర్మజభీమఫల్గునుల్
వరగుణు లాపృథాసతికి వారిజవైరికులప్రదీపులై.

405


గీ.

కన్య యగుచుఁ దండ్రికడ నుండి యాపృథా, వనిత కమలబంధువరమువలన
కర్ణుఁ గనియె జగతిఁ గానీనుఁ డన నాతఁ, డధికకీర్తిశాలి యగుచుఁ బరఁగె.

406


క.

ధవళాయతాక్షి యాపృథ, సవతికి మాద్రికి సురూపసంపన్నులు సం
భవిలిరి నందను లిద్దఱు, సవినయు లాశ్వినులు నకులసహదేవు లనన్.

407