పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

స్తవమునకు మెచ్చి భానుం, డవనీపతియెదుట నిలిచె నపుడ స్పష్ట
ప్రవిమలతనుఁడై యది గని, రవికిఁ గరద్వయము మొగిచి రా జి ట్లనియెన్.

330


గీ.

వహ్నిపోగు వోయువడువున నభమున, సంచరింతు రెపుడు స్వామివారు
అవ్విధమున నిటకు నరుదెంచినారు మీ, దివ్యమూర్తి యెట్లు తెలియువాఁడ.

331


వ.

స్పష్టంబుగా దేవరవారిదివ్యదేహంబు నాకన్నులకుం గానంబడదేని మీరు
ప్రసన్నం బౌటకు ఫలం బేమి యనినఁ గృపావశంవదుండై యాదిత్యుండు తన
కంఠంబునం బెట్టిన స్యమంతకనామ దివ్యమణిశ్రేష్ఠంబు తీసి యాకడం బెట్టిన.

332


గీ.

హ్రస్వమై తప్తతామ్రాభమై సమంచ, దీషదాపింగళాతక్షమై యెసఁగుభాను
దివ్యదేహంబు గాంచి పార్థివవరుండు, హర్షియై మ్రొక్కి యున్నఁ బద్మాప్తుఁ డపుడు.

333


క.

వర మడుగు ధరణివర యన, సరసిజహితుఁ జూచి నృపుఁడు స్వామీ నా కీ
వరమణి నిమ్మన నాయం, బరమణి యది యొసఁగి చనియె మగుడం దివికిన్.

334


వ.

సత్రాజితుండును నమ్మహామణి కంఠంబునం ధరించి యాదిత్యుండునుంబోలె
తేజోవిశేషంబున దిగంతరంబులు వెలిగించుచు ద్వారకకు వచ్చినఁ బౌరు
లెల్లను విస్మయము నొంది జగద్భారావతరణార్థంబు మానుషరూపధారియైన
యాదిపురుషుం బురుషోత్తముఁ గాంచి యిట్లనిరి.

335


చ.

కమలదళాక్ష మాధవ జగత్పరిరక్షణదక్ష, కృష్ణ య
క్కమలహితుండు మీచరణకంజము లిప్పుడు గొల్వవచ్చె ని
క్క మనుచు విన్నవించిన వికస్వరహాసవిభాసితాస్యప
ద్మ మలర వారి కిట్లనియె దానవభేది తదర్థవేదియై.

336


క.

ఇతఁడు రవి గాఁడు సత్రా, జితుఁ డింతేకాని భాను సేవించి తదూ
ర్జితకృప స్యమంతకంబను, నతులితరత్నంబు దెచ్చెనని చెప్పుటయున్.

337


వ.

పౌరులెల్ల విశ్వసించి చని రంత, సత్రాజితుం డంతఃపురంబు ప్రవేశించి స్యమం
తకంబును దాఁచె. అమ్మణియును బ్రతిదినంబును నెనిమిదిబారువులకన
కం బీనుచుండు తత్ప్రభావంబున రాష్ట్రంబున కుపసర్గానావృష్టివ్యాళాగ్ని
తోయదుర్భిక్షాగ్నిభయంబులు లేకయుండె. అంత.

338


సీ.

పుండరీకాక్షుఁ డెప్పుడు కోరు నద్దివ్య, మణి యుగ్రసేనభూమండలేశ్వ
రునకె యోగ్యం బని మనమున నట్లయ్యు, గోత్రభేదభయం బగు న్యథార్థ
మని మణి గొననొల్లఁడయ్యె సత్రాజితుం, డచ్యుతుం డడుగునో యనెడుశంక
భ్రాంతి యింతయు లేక భ్రాత కిచ్చిన నాప్ర, సేనుండు నమ్మణిఁ జెలఁగిగొనియె