పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

వయఃపరిణత యయ్యును, నల్పదినంబులలోన శైబ్య గర్భంబు దాలిచి కుమా
రునిం గనియె. అతనికి జ్యామఖుండు విదర్భనామం బిడియె. అతండు సంప్రాప్త
యౌవనండై స్నుషయగు నారాజకన్యం బరిణయం బయ్యె. వారి కిద్దఱికి గ్రధ,
కైశిక, రోమపాదులను మువ్వురుపుత్రులు పుట్టిరి. అందు రోమపాదునకు
బభ్రుండు, బభ్రునకు ధృతి పుట్టె. కైశికునకుఁ జేది చేదిసంతతియందుఁ జైద్యు
లను రాజులు పుట్టిరి. అందు గ్రధుండను స్నుషాపుత్రునకుఁ గుంతి, కుంతికి
ధృష్టి, ధృష్టికి నిధృతి, నిధృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు,
వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమ
రథునకు నవరథుఁడు, నతనికి దశరథుఁడు, నతనికి శకుని, శకునికిఁ గరంభి, కరంభికి
దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధుండు, మధు
నకుఁ గుమారవంతుండు, కుమారవంతునకు ననుండు, ననునకుఁ బురుమిత్రుండు,
పురుమిత్రునకు నంశుండు, నంశునకు సత్వతుండు, సత్వతునకు సాత్వతులు
గలిగిరి. ఇది జ్యామఖునిసంతతి. దీని సమ్యక్ఛ్రద్ధావంతులై వినినఁ బాపం
బులం బాయుదురని చెప్పి శ్రీపరాశరుఁడు మైత్రేయున కిట్లనియె.

324


క.

మునివర సాత్వతవంశము, వినుము తదీయశ్రవణము వివిధాఘహరం
బనుపమసంపత్కారణ, మనవరతశుభాస్పదము ప్రియంబు తలఁపఁగన్.

325


వ.

సాత్వతునకు భజన, భజమాన, దివ్యాంధక, దేవాపృథ, మహాభోజ, వృష్ణి
సంజ్ఞులు పుత్రులు కలిగిరి. అందు భజమానునికి నిమి, వృక, వృష్ణులను
పుత్రులు పుట్టిరి. మఱియుఁ దద్ద్వైమాత్రులు శతజి త్సహస్రజి దయుతజి త్సం
జ్ఞులు పుట్టిరి. దేవాపృథునకు బభ్రుండు కలిగె.

326


క.

దేవాపృథుఁడును బభ్రుఁడు, నేవిశ్వములోన నధికు లెన్నినచోటన్
భావిభవద్భూతధరి, త్రీవల్లభకోటిలోనఁ బృథుగుణగరిమన్.

327


వ.

దేవాపృథుండు దేవసముండు. అక్కాలంబునఁ బదునాల్గువేలున్నఱువ
దార్గురు పురుషులు, బభ్రుదేవాపృథులవలన నమృతత్వంబు నొందిరి. మహా
భోజుం డతిధార్మికుం డతనియన్వయంబున భోజ, మార్తికావరులు పుట్టిరి.
వృష్ణికి సుమిత్రుండు, యుధాజిత్తునుం బుట్టిరి. యుధాజిత్తునకు ననమిత్రుండును
సేనియును, ననమిత్రునకు నిఘ్నుండును, నిఘ్నునకుఁ బ్రసేనసత్రాజిత్తులు
పుట్టిరి. ఆసత్రాజిత్తునకు భగవంతుండైన సూర్యుండు సఖుండయ్యె వినుము.

328


క.

జలనిధితీరమునకు నిశ్చలమతితో నేగి యచట సత్రాజితుఁ డ
త్యలఘుతరభక్తియుక్తిన్ జలజాప్తుం గొలిచి పొగడె సారస్తుతులన్.

329