పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అవనిలో భార్యలకు వశులైన భూత, భావిభవదధిపతులతో నేవిధమున
జ్యామఖుఁడె శ్రేష్ఠుఁ డనుచు నుద్దామలీల, జనులు చెప్పుదు రెపుడు నాశ్చర్యముగను.

314


వ.

ఆజ్యామఖుండు భార్యయైన శైబ్యకు వశుండై యుండు. అతం డనపత్యుం
డయ్యును శైబ్యకు వెఱచి భార్యేతరపరిగ్రహంబు చేయక పెద్దకాలం బుండె.

315


ఉ.

జ్యామఖుఁ డొక్కనాఁడు చతురంగబలంబులు గొల్వ జైత్రయా
త్రాముదితాత్ముఁడై కదిలి ప్రస్ఫురితప్రకటప్రతాపరే
ఖామితలీల శాత్రవధరాధిపులం బరిమార్ప వారు సం
గ్రామభయార్తులై నిజపురంబులు వెల్వడి పాఱిపోయినన్.

316


వ.

తదీయనగరంబులు సొచ్చి సర్వధనంబులు గొల్లగొట్టుకొని విజయంబు గైకొని
మగుడునప్పు డొక్కయెడ.

317


సీ.

భయచంచలీభవన్నయనాంచలాంచిత, ద్యుతి చంచలల దిశల్ దొంగలింపఁ
ద్రాసకంపితకుచస్తబకవేల్లితతనూ, వల్లి చూపఱకు భావంబు గొలుప
నిబిడీభవదీర్ఘనిశ్వాసభరపీడ, చేత లేఁగెమ్మోవిచిగురు కంద
నయనాశ్రుబిందుసంతతి మీనముఖవాంత, సరసముక్తాపరంపరలఁ బోల


గీ.

నన్న రక్షించు కావంగదయ్య తండ్రి, తల్లి ప్రోవుమటంచు నార్తస్వరమున
సొలసి యేడ్చుచు దిక్కులు చూచురాజ, కన్యకామణి నొక్కతెఁ గాంచె నృపుడు.

318


వ.

ఇట్లు గాంచి యనపత్యుండైన నాకు దైవయోగంబున నిక్కాంత గలిగె. దీనిం
బరిణయంబై యపత్యంబులం గనియెద, నరదంబుపై నిడికొని శైబ్యాను
మతంబునఁ బరిణయం బయ్యెదంగాక యని యరదంబుపై నిడికొని బల
సమేతుండై పురంబునకుం జనినఁ పౌరామాత్యమూలబలంబులతో గూడి
శైబ్య వల్లభున కెదురువచ్చి రథంబుపై నున్న కన్యకం గాంచి కించిదుద్భూతా
మర్షస్ఫురదధరపల్లవ యగుచు వల్లభున కిట్లనియె.

319


గీ.

అతిచపలచిత్త నీ వీమృగాయతాక్షి, నెచటఁ దెచ్చితి విది యెవ్వ రేల యనిన
భీతి మరుమాట తోఁచ కిన్నాతి నీదు, కోడ లన నవ్విభునకు నాకొమ్మఁ పలికె.

320


క.

మనుజవర పుత్రకుని నే, గనుటయె లే దన్యకాంత కలుగదు నీకున్
దనయుని గనుటకు విను మే, యనువున నిది కోడ లయ్యె నని పల్కుటయున్.

321


వ.

నిజప్రేయసీకోపకలుషితవివేకుండై భయంబున దురుక్తిపరిహారార్థంబుగా
ని ట్లనియె.

322


గీ.

కాంత నీవు సుతుని గనియెద వింక నా, తనికిఁ బెండ్లి చేయఁదలఁచి దీనిఁ
దెచ్చినాఁడ ననిన దేవి నవ్వుచు తాను, నతఁడు గూడి నగరి కరిగె నంత.

323