పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సకలధరాస్థలంబులుం బాలించి యజ్ఞసహస్రంబులు చేసి రాజులెవ్వరు
నశేషగుణంబులఁ దనకు సాటిలేనట్లుగా మెలంగి యెనుబదేనువేలేండ్ల
వ్యాహతారోగ్యశ్రీబలపరాక్రమసమేతుండై మాహిష్మతీనగరంబు
రాజధానిగా నుండు సమయంబున.

309


సీ.

కాంతాసమేతుఁడై కార్తవీర్యుఁడు వేడ్క, నర్మద నవగాహనంబు చేయ
సకలదిగ్విజయంబు సాధించి దశకంఠుఁ, డాహవోత్సాహుఁడై యటకు వచ్చి
పొడచూప నారాజపుంగవుం డపు డల, వోక నాదను జేంద్రుఁ బొదివిపట్టి
నిఖిలసురాసురానీకసంగరరంగ, విజయగర్వం బెల్ల వీటిఁబుచ్చి


గీ.

చెలఁగఁ జేతులు వెనుకకు నులిచి తీసి, మొఱ్ఱపెట్టంగ లాకలు మోయవిఱిచి
కట్టి పసరమువలెఁ ద్రాటఁ బట్టి తెచ్చి, గేలిఁ బెట్టించి తనచెఱసాలఁ బెట్టి

310


వ.

పంచాశీతివర్షసహస్రోపలక్షణకాలావసానంబున శ్రీమన్నారాయణాంశ
భూతుండైన పరశురామునిచేత నుపసంహృతుం డయ్యె. అయ్యర్జునునకుఁ
బుత్రశతంబు పుట్టె నందు శూరసేన, వృష, మధు, జయధ్వజ, సంజ్ఞులు
శ్రేష్ఠు లందు జయధ్వజునకుఁ దాలజంఘుం డతనికిఁ దాలజంఘాఖ్యగల పుత్త్ర
శతంబు పుట్టె. అందు జ్యేష్ఠుఁడు వీతిహోత్రుఁడు. వేఱొక్కండు భరతుండు.
అతనికి వృషుఁడు, వృషునకు మధువు, మధువునకు వృష్ణిప్రముఖపుత్రశతంబు
గలిగె. అందువలన వీరిగోత్రంబునకు వృష్ణిసంజ్ఞ గలిగె. మధువువలన మధుర
గలిగె. యదుకులసంభవు లగుట యాదవులైరి. మఱియు యదువుపుత్రుండైన
క్రోష్టువునకు ధ్వజినీవంతుడు నతనికి స్వాతి యతనికి రుశంకుండు నతనికిఁ
జిత్రరథుం డతనికి శశిబిందుండు పుట్టి చక్రవర్తి యయ్యె.

311


మ.

శశిబిందుం డలరున్ సమస్తధరణీచక్రేశుఁడై పూర్ణిమా
శశిబింబాస్యల లక్షభార్యల విలాసక్రీడలం దేల్చుచున్
దశలక్షాత్మజులన్ మహాభుజులఁ బొందం గాంచి హర్షించుచున్
దశదిగ్భిత్తులఁ గీర్తిచంద్రికలు నిత్యస్ఫూర్తి నిండించుచున్.

312


వ.

ఆశశిబిందుపుత్రులలోఁ బృథుయశుండు, పృథుకర్ముండు, పృథుజయుండు,
పృథుకీర్తి, బృథుదానుండు, పృథుశ్రవుండును నన నార్వురుశ్రేష్ఠు లందు
పృధుశ్రవునికిఁ బృథుతముండు నతనికి నుశనుండు పుట్టె. అతండే కదా వాజి
మేధశతం బాహరించె. అయ్యుశనునకు శితవుండు, నతనికి రుక్మకవచుం, డతనికి
పరవృత్తు, నతనికి రుక్మేషు పృథు జ్యామఖ వలిత హరితసంజ్ఞు లైదుగురు
పుత్రులు. అందు జ్యామఖుండు రా జయ్యె వినుము.

313