పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నంత కావ్యుఁ డలిగి యల్లుని నతిజరా, పీడ నొందుమని శపించుటయును
నృపతి మామపాదనీరేజముల వ్రాలి, తాళఁబట్టి ప్రతివిధాన మెఱిఁగి.

295


వ.

కొడుకుల రావించి యందు నగ్రనందనుండైన యదువున కిట్లనియె.

296


ఉ.

తామసుఁడై యకాలము గదా యని యెంచక మించి నీదుమా
తామహుఁ డల్గి యిచ్చె నతిదారుణశాపము నీవు నాజరా
భూమిక పూని నా కొసఁగు భోగ్యభవన్నవయౌవనంబు ని
త్యామితభోగము ల్గని సహస్రసమాప్తిగ నిత్తుఁ గ్రమ్మరన్.

297


వ.

యదుండును జరాగ్రహణంబున కంగీకరింపకయున్న రాజ్యంబున కర్హత లే
కుండునట్లుగా శపించి క్రమంబున దుర్వసు ద్రుహ్వ్యసువుల నడిగిన వారును
నొడంబడక యున్న శపించి వారి కందఱికిన్ గనిష్ఠుండగు పూరునిఁ బిలిచి యావ
నం బడిగిన నతండు.

298


ఉ.

సాగిలి మ్రొక్కి లేచి కరసారసము ల్ముకుళించి యోమహా
భాగ కృతార్థతాగరిమ వాటిలె మీవచనంబు చేయుటన్
బాగగుయౌవనంబుఁ గొని పాటిలు నీజర నాకు నిచ్చి సు
శ్రీగురుభోగభాగ్యములు చేకొనుఁ డంచు నొసంగెఁ బ్రీతితోన్.

299


వ.

ఇట్లు పూరుండు యౌవనం బిచ్చిన బుచ్చుకొని యయాతి తనజర పూరున కిచ్చె,
ధర్మావిరుద్ధంబులును యధాకాలోపపన్నంబులును యధోత్సాహనిర్వర్త్యం
బులును నైన కామోపభోగంబులు వేయేం డ్లనుభవించి తనవి చనక యొక్క
నాఁ డిట్లని గానంబు చేసె.

300


చ.

విసువక యెన్నినా ళ్లనుభవించిన శాంతి వహించ దెంతక
క్కసము భళీర కామము నికామము నాజ్యసమర్పణంబునన్
బస చెడునే హుతాశనుఁడు మర్త్యుఁడు దీనికి లొంగెనేని సం
తసము లభించఁగాఁ గలఁడె నాకముఖాఖిలరాజ్య మేలినన్.

301


క.

దంతములు వదలె కేశము, లెంతయు పలితంబు లయ్యెఁ దృష్ణయు బ్రతుకన్
భ్రాంతియుఁ దరుణమ లయ్యెడు, నంతంతకు నెట్టిచిత్ర మతివృద్ధునకున్.

302


ఉ.

పూనిక భూరివైషయికభోగమహానుభవంబు చేయఁగా
నే నినుపారి నూఱుపదు లేండ్లు చనె న్విషయంబులందు నిం
తైనను దృష్ణ మానదు నిరంతరముం ఘనవృద్ధిఁ బొందెడుం
గాని విచిత్ర మిత్తెఱఁగుఁ గానముగా వివరింప నెందులన్.

303