పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుకుమారునకు దృష్టకేతుండు, దృష్టకేతునకు వీతిహోత్రుండు, నతనికి భార్గుండు,
భార్గునకు భార్గభూమి పుట్టె. అతనివలనఁ జాతుర్వర్ణ్యంబునుం బ్రవర్తించె.
వీరు కాశ్యపరాజు లింక రజిసంతతి వినుమని శ్రీపరాశరుండు మైత్రేయున
కిట్లనియె.

278


క.

రజికిఁ దనూభవు లాహవ, విజయులు సత్కీర్తిధనులు విఖ్యాతమహా
భుజవీర్యధుర్యు లేనూ, ఱజితులు గల్గిరి జగన్ముదావహు లగుచున్.

279


వ.

అక్కాలంబున దేవాసురులు పరస్పరజిగీషువులై యుద్ధంబునకు నుపక్రమించు
వారై చతుర్ముఖుపాలికిం బోయి మ్రొక్కి యిట్లనిరి.

280


క.

సరసిజసంభవ దేవా, సురులము మే మాహవమ్ము చోద్యభుజావి
స్ఫురణమునఁ జేయఁదలఁచితి, మిరువాగున విజయలక్ష్మి యెవ్వరిదొక్కో.

281


వ.

అని యడిగిన దేవాసురులకుఁ జతురాననుం డిట్లనియె.

282


క.

రజి యెవ్వరికిం దోడై, భుజవిస్ఫురణంబు చూపుఁ బోర న్వారిన్
విజయశ్రీ చేరు ననన్, రజనీచరవరులు చనిరి రజికడకు వడిన్.

283


వ.

ఇట్లు చని తమకు సహాయంబు కోరిన నసురలకు రజి యిట్లనియె.

284


ఉ.

మీకు సహాయమై యతిసమృద్ధభుజాబలలీల దేవతా
నీకముతోడఁ బోరెద నని న్నను నింద్రునిఁ జేసి కొల్వుఁ డెం
తేకుతుకాప్తి మీర లన నిట్లని రింద్రుఁడు మాకు నాహవా
స్తోకభుజావలేపబలధుర్యుఁ డవార్యుఁడు శౌర్యలీలలన్.

285


వ.

ప్రహ్లాదుం డుండ ని న్నింద్రుఁ జేయనొల్లము. తదర్ధంబ యుద్ధంబును నని యసురులు
చనిన సురలు రజికడకు వచ్చి సహాయంబు వేఁడిన రజి దేవతల కిట్లనియె.

286


గీ.

అసురతతుల గెల్తు నాహవంబున నను, నింద్రుఁ జేసి కొలువుఁ డీర లనిన
యుక్త మనుచు దాని కొప్పి తో కొనిపోవ, రజియుఁ గలన దనుజరాజి నడచె.

287


ఉ.

అంత శచీవిభుండు వినయంబున నన్నరనాథుఁ బాదపీ
ఠాంతికభూమిఁ జేరి చరణాంబుజముల్ తల సోక మ్రొక్కి భూ
కాంతభయంబు మాన్పితివి గావునఁ దండ్రివి గావె నీవు నా
కెం తనవచ్చు నీమహిమ యిన్నిజగంబులుపుత్త్రుఁ డేలినన్.

288


వ.

అని చాతుర్యపురస్సరంబుగాఁ బ్రార్ధించిన రజియు మందస్మితవదనారవిం
దుండై యట్లకాక యనుచు నిజపురంబునకు వచ్చి కొంతకాలంబునకుఁ బరలోక
గతుండైన యనంతరం బారజిపుత్రులు రాజ్యంబు చేయుచున్నంత.

289