పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉత్సాహ.

కామినీలలామ పల్కెఁ గాకిఁ గూడి యక్కటా
భూమినృపతు లెల్ల నీకు భూరిబలు లొసంగఁగా
స్వామియై చరించు నీ వసద్బలిప్రభోక్త వై
తేమి గలదు పూర్వకర్మ మింత వింత చేయఁగాన్.

335


వ.

పాషండసల్లాపదోషంబున శునక, సృగాల, వృక, గృధ్రజన్మంబు లెత్తి
యిప్పుడు కాకంబ వైతే యని తలఁపించిన.

336


గీ.

కాకతనువు విడిచి గ్రక్కున కొంగయై, యున్నవిభునికడకు నొయ్యఁ జేరి
చెలియ యెప్పటట్లు తలఁపింప నమ్మహీ, విభుఁడు నెమిలి యయ్యె విప్రవర్య.

337


చ.

విభుఁడు మయూరజన్మము, నవీనత నెత్తు టెఱింగి యప్పు డ
య్యిభరిపుమధ్య దానికి నభీష్టవరాభ్యవహారకృత్యముల్
ప్రభ నొనరించుచు న్సుకృతపాకము గోరుచుఁ బెంచుచుండఁ ద
చ్ఛుభచరితంబు పక్వమగు చొప్పునఁ గాలము వీలవచ్చినన్.

338


వ.

అక్కాలంబున జనకభూపాలుండు వాజిమేధమహాక్రతువు చేసి తద్దీక్షాం
తంబయిన యపబృథస్నానంబు చేయ నప్పు డప్పువ్వుఁబోఁడి మయూరంబుం
దాను నపబృథస్నానంబు చేసి యమ్మయూర౦బుఁ జూచి పాషండసల్లాప
దోషంబున శునక, సృగాల, వృక, గృధ్ర, కాక, బకజన్మంబు లెత్తి యిప్పుడు
మయూరంబవై యున్నాఁడవు. తలంచుకొనుమని తలఁపించిన జాతిస్మరుండై
మయూరదేహంబు విడిచి యజ్జనకమహీపాలునకుం బుత్రుండై జన్మించి
శీఘ్రకాలంబున సంప్ర్రాప్తయౌవనుం డయ్యె నంత.

339


ఉ.

మానిని తండ్రితోడ ననుమానము మాని మదీయపాణిపీ
డానుపమానయత్నమునకై యివు డీవు స్వయంవరంబు వెం
పూనఁగఁ జేయుమన్న ముద మొందుచుఁ గాశివిభుండు చేసెఁ బెం
పై నెగడన్ స్వయంవరమహం బరుదెంచిరి రాజనందనుల్.

340


గీ.

ముదముతోడ స్వయంవరమునకు రాజ, పుత్రు లేతేర నందులోఁ బూవుఁబోఁడి
జనకభూపాలనందనుఁ జారుకీర్తిఁ, దనపతి వరించె ధర్మపథంబు వెలయ.

341


వ.

అక్కాంతారత్నంబుతో నారాజనందనుండు బహుభోగంబు లనుభవించి
తండ్రిపరోక్షంబున వైదేహదేశంబునకు రాజై సాంగదక్షిణాకంబుగా బహు
యజ్ఞంబులు చేసి యనేకదానంబులు ధర్మంబులు చేసి పుత్రుల నుత్పాదించి
శాత్రవుల జయించి యథాన్యాయంబుగా రాజ్యంబు పాలించి ధర్మక్రమంబున