పుట:విక్రమార్కచరిత్రము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

91


మ.

వినఁ జూడం గొఱగానిచేష్టలఁ దపోవిఘ్నంబు గావింపఁ బూ
నినదోషంబున, భీషణాసురకశానిర్ఘాతపాతవ్యథా
జనితాక్రోశరవంబుతోడ, మథురాసామీప్యబిల్వాటవీ
వనికాసీమఁ బ్రతిక్షపంబు తరుణీ! వర్తింపు దీనాస్యవై.

252


క.

అనుడును, శాపాలాపము
లనుతాపము సేయ, మునికి సాష్టాంగముగా,
వినతి యొనరించి, యెంతయు
వినయంబున శాపముక్తివిధ మడుగుటయున్.

253


మ.

క్షితిసంరక్షణ మాచరించుటకునై, శ్రీకామినీనాయకుం
డతులోదారుఁడు విక్రమార్కుఁ డన బ్రహ్మక్షత్త్రతేజోమయా
కృతి నావిష్కృతి నొందువాఁ, డతనియంగీకార మీశాపదు
ష్కృతికి న్నిష్కృతి సేయుఁ బొమ్మని కటాక్షించెం బ్రసన్నాత్ముఁడై.

254


క.

ఆమునిశాపానుగ్రహ
సామర్థ్యమువలన నసురజనితవ్యథయున్
భూమీశ! యిట్లు పొరలఁగ
నీమహిమ విముక్తి గలిగె నిది విదితముగన్.

255


వ.

అని వినిపించి కమలావతీవధూరత్నంబు.

256


క.

దానసమగ్రత వేలుపు
మానికముం బోలుననుచు, మహనీయమణిం
గానుక యిచ్చి, నరేంద్రుని
వేనోళ్లం బ్రస్తుతించి, వీడ్కొని చనియెన్.

257


మ.

ధరణీశుండును వీడుపట్టునకు నుద్యత్ప్రీతి నేతెంచి, య
త్తరుణీరత్నముశావముక్తికిని జిత్తంబందు హర్షించుచుం,
దరుణాదిత్యుప్రభన్ వెలుంగు సురకాంతాదత్తరత్నంబు స
త్కరుణన్ వైశ్యున కిచ్చెఁ దద్వితరణౌదార్యంబు నగ్గించుచున్.

258