పుట:విక్రమార్కచరిత్రము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

విక్రమార్క చరిత్రము


క.

కనుఁగొని, వెఱవకు వెఱవకు
మని యూఱడఁ బలికి సతికి నభయప్రదుఁడై,
మనుజేంద్రుఁడు గర్వితుఁడై
దనుజేంద్రుల కనియె నత్యుదగ్రస్ఫురణన్.

235


రాక్షసులను సంహరించి విక్రమార్కుఁడు కమలావతిని రక్షించుట

ఉ.

ఓరి దురాత్ములార! దళితోత్పలలోచన నేల యీక్రియన్
ఘోరకశాభిఘాతములఁ గుందఁగఁ జేసెద, రింత కోర్తురే
యారయఁ బుష్పకోమల? లహంకృతు లిం కిట మాన కున్న, మ
ద్ఘోరకరాసిపత్త్రమునకున్ బలిసేయుదు నీక్షణంబునన్.

236


వ.

అనిన నన్నిశాచరులు సాహసాంకునకు నిట్లనిరి.

237


సీ.

కైకొందు మమరేంద్రుఘనరాజ్యపదరమా
        ధీనత నేకధాటీనిరూఢి,
దండింతు మతిదుర్మదస్ఫూర్తి నంతకు
        నిజభుజాగర్వంబు నిమిషమాత్ర,
భంజింతు మపరదిక్పాలకుచతురంగ
        బలగర్వములు తృణప్రాయములుగ,
హరియింతు మే ముత్తరాధీశపాలిత
        నవనిధానములు ప్రాభవ మెలర్ప,


తే.

నంతలేసి మహాత్ముల నింత సేయు
మాకు, నిను సంహరించుటమాత్ర మెంత?
‘యెందు గుడిమ్రింగువారికి నంది పిండి
పడియ’ మనుప ల్కెఱుంగవే పుడమిలోన!

238


చ.

అనవుడు, మందహాసరుచి యాననపద్మమునం దలిర్పఁ జ
య్యన నిశితాసిపుత్త్రిక కరాంబురుహంబున సంతరించి, య
ద్దనుజబలంబుపై నడచె, దారుణవారణసైన్యయోధమ
ర్దనవిభవాభిరాముఁ డగు రామనృపాలునిఁ గ్రేణిసేయుచున్.

239