పుట:విక్రమార్కచరిత్రము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

87


క.

ధర యెల్లఁ దీర్థసేవా
పరతమెయిఁ బరిభ్రమించి, బహువిధవిభవ
స్ఫురణ విలసిల్లుమథురా
పురి కేఁ జని, యందు నొక్కభూసురునింటన్.

228


వ.

కృతశయనుండనై యున్న, నిశాసమయంబున నప్పురోపకంఠంబునందు, వితతనిర్ఘాతపాతంబులగు కళాఘాతంబులకుం గా కాతురయగు నొక్కకాంతయార్తనాదంబు కర్ణగోచరం బగుటయు; నత్తెఱం గందుల గృహమేధిం ప్రబోధించి యడుగుటయు, నతం డిట్లనియె.

229


ఉ.

ఏమి నిమిత్తమో యెఱుఁగ, మీపురిచేరున బిల్వవాటికా
సీమఁ బ్రతిక్షపంబు, సరసీరుహలోచన యోర్తు దానవ
స్తోమకశాభిఘాతములఁ దోరపువేదన సైఁపలేక యు
ద్దామత నార్తనాదపరతం బ్రలపింపఁగ విందు మెప్పుడున్.

230


క.

అనియె, నని విన్నవించిన
విని, యత్తెఱఁగెల్ల నెఱుఁగువేడుక మదిలో
జనియించి, వైశ్యయుతుఁడై
మనుజాధీశుండు చనియె మథురాపురికిన్.

231


విక్రమార్కుఁడు పురందరయుతుఁడయి మధురపురి కేఁగుట

క.

అందుఁ బురందరదర్శిత
మందిరమున విశ్రమింప, మధ్యమనిశయం
దిందుముఖియార్తనాదము
నందంద వినంగఁబడియె నధిపతి, కంతన్.

232


వ.

వినంబడినయాయెలుంగుచక్కటికిం జని.

233


ఆ.

కనియె నృపుఁ డఖర్వగర్వాంధదైతేయ
ఘనకశాభిఘాతకాతరాత్మఁ
దీప్రవేదనాప్రదీపితార్తస్వన
నిబిడితాస్య నొక్కనీరజాస్య.

234