పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

వాసిష్ఠరామాయణము

గీ. పరఁగ దుర్వాసనలఁ గట్టుపడ్డమనసు
     జ్ఞానవాసనచేఁ గ్రాఁగి శాంతి నొందు;
     సమ్యగాలోకచిత్తవాసనల చిత్త
     మణఁగు రఘురామ విను దీప మణఁగునట్లు.52
వ. అని యిట్లు భీమాద్యుపాఖ్యానంబున జగత్స్థితిమాయికత్వంబు సెప్పి,
     యింక దాశూరోపాఖ్యానంబున నీయర్థంబు విశదంబుగాఁ జెప్పుదు
     ననిన, రామచంద్రుండు విశ్వాతీతం బైనచిదాత్మయందు విశ్వం బెట్లుం
     డె! నివ్విధంబు తేటపడ నెఱింగింపవే యనిన, నమ్మునీశ్వరుం డి ట్లనియె.53
క. విను రాఘవ నిర్మలచి
     ద్ఘన మాత్మునియందుఁ దాన కలిగి ప్రపంచం
     బనుపేర విజృంభించును
     ఘనమృగతృష్ణికలు నీళ్లగతిఁ దోఁచు క్రియన్.54
గీ. పరఁగఁ దనయాత్మ మదవశభ్రాంతిఁ జెంది
     యన్యుఁడును బోలెఁ దోఁచినయట్టిభంగి
     మానసంబున నజ్ఞానమహిమఁ జేసి
     యాతఁడు నతఁడు గా కుండు నలఘుచరిత.55
గీ. ఒనర దీపంబునను వెలుఁ గున్నయట్లు,
     పువ్వు గలుగంగఁ దావియుఁ బొలుచునట్లు,
     సూర్యుఁ డుండంగఁ బగ లగుచున్నయట్లు,
     చిత్తు గలుగంగ జగములు చెలఁగుచుండు.56
వ అనిన విని రామచంద్రుం డమ్మునిచంద్రున కి ట్లనియె.57
క. క్షీరోదధిలహరీగం
     భీరము లై శీతలములు ప్రియములు నగు మీ
     సారోక్తులచే నామది
     యారయ సుజ్ఞానజనక మయ్యె మునీంద్రా.58