పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

67

వ. ఇది మోక్షకారణంబును బంధనిరసంబు నై జీవన్ముక్తి యొనర్చు
     మఱియును.47
క. కరచరణాద్యవయవముల
     కిరవై చరియించుదేహ మిది నీమదిలోఁ
     దిరముగ నిలుపునహంకృతి
     యరయఁ దృతీయాఖ్య మధమ మగు దాశరథీ.48
వ. ఈ యహంకారత్రయంబును విడిచినయతండు పరమనిర్వాణపదంబు
     నొందు. నహంకారరహితు లై భీమాదులు పరమపదప్రాప్తు లగుట
     విస్పష్టంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.49
సీ. మును శంబరుం డనుదనుజుండు తనమాయ
                    నిర్మింపబడు రజనీచరేంద్రు
     లతిమూర్ఖు లైనదామాదులు సురలచే
                    హతు లైనఁ జింతిలి యతఁడు మఱియు;
     దైవసేనల నోర్చుతలఁపున నధ్యాత్మ
                    శాస్త్రవివేకుల సత్త్వధనుల
     గతమత్సరుల నహంకారదూరుల వేద
                    వేదాంతవేత్తల విమలమతుల
గీ. భీమబాహాఖ్యదృఢు లను పేర్లవారిఁ
     బొలుచుతనమాయ నబ్ధిబుద్బుదములట్ల
     నెన్నఁ బెక్కండ్ర సృజియింప; నెసఁగ వారు
     నతిజరామృతివర్జితు లై కణఁగిరి.50
వ. ప్రాప్తార్థకాములును, వర్తమానానువర్తులును, సర్వసములు, నగు న
     ద్దానవుల చేత నిర్జరసైనికులు చచ్చియు, నొచ్చియు, వెఱచియు, పలా
     యనపరాయణులై, జ్ఞానవాసన విషయానుభవంబున నశియించిన
     ట్లణంగిరి. అట్లు గావున.51