పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

వాసిష్ఠరామాయణము


బత్తి రసస్వరూప మగునట్టి విధంబునఁ; జిత్త మవ్వలన్
మెత్తనిమేనితో మెలఁగ మేకొన నీ విటు రిత్త బొందులన్
గృత్తము సేయ నేల! పరికింపుము చిత్తవికారభావముల్.

184


ఉ.

దేహ మణంగిపోయినను, దేహశతంబులు దా మడంగినన్
మోహము సేయు నింతటికి మూలము చిత్తము; స్వప్నభూమిలో
నీహలు దీర్చుకొన్నయటు లిన్నియుఁ జిత్తలయంబు సేసినన్
దేహము వాసిపోవు జగతీవర దాఁపుము చిత్తరత్నమున్.

185


వ.

అనవుండు.

186


క.

పరమార్థామృత మగునా
యిరువురవాక్యములు విని మహీశుఁడు వారిన్
బొరి శిక్షించినవాఁడై
పురి వెడలఁగ నడిచి పుచ్చె భూవరముఖ్యా.

187


వ.

ఇట్లు పురంబు వెలుపడి యింద్రాహల్య లిరువురు నన్యోన్యప్రేమాతి
రేకంబునం గామోపభోగంబు లనుభవించి పెద్దకాలంబునకుఁ దనివి
సన దివ్యజ్ఞానసంపన్నులును నిత్యముక్తులు నై పరమసిద్ధికిం జని రని
కృత్రిమేంద్రోపాఖ్యానంబు సెప్పి; వసిష్ణుండు, సకలశరీరులకు శరీర
ద్వయంబు గలిగియుండు, నందు మనశ్శరీరంబు క్షిప్రగతియు సదాచ
లనంబు నై యుండు, స్థూలశరీరంబు రక్తాస్థిమాంసనిర్మితంబు నై
యుండు, ననిన రఘునందనుం డి ట్లనియె.

188


క.

మన మతిజడము నమూర్తం
బును సంకల్పప్రభూతమును నగు నేరూ
పున దేహము ధరియించెను
వినిపింపుము మునివరేణ్య విస్తరఫణితిన్.

189


వ.

అనిన విని వసిష్ఠుం డనంతంబును సర్వశక్తిమయంబు నగుపరమా
త్మునిసంకల్పంబు శక్తిఖచితంబు మనం బని బుధుల చేత వినంబడు