పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


క.

నరునిశరీరమున జరా
తరుణి ప్రవేశించి ప్రజ్ఞ దరలించుఁ జుమీ
పరకాంత గృహముఁ జేకొని
దురటిలునిల్లాలి వెడలఁ ద్రోచిన భంగిన్.

123


సీ.

పుత్త్రదారాదులు మిత్త్రులుఁ దనుఁ వెఱ్ఱిఁ
        జేసి నవ్వఁగ మదిఁ జివికి చివికి,
కుడువ వేడుక పుట్టి గడియు నోటికిఁ బోని
        వేదన వెడవెడ వెచ్చి వెచ్చి,
యంగకంబులజవం బడఁగంగఁ దనివోని
        భోగేచ్ఛ వొడమఁగఁ బొక్కి పొక్కి,
తనుతంతువులు రోగ మనుమూషకము చేరి
        కొఱుకంగ లా వేది క్రుస్సి క్రుస్సి,


గీ.

కడఁగి మేన బూదిఁ దుడిచినవిధమున
ముణిఁగి నరసియున్న ముదుకశిరముఁ
గోరి బూదిచఱుచుకూష్మాండఫలభాతి
వెదకి కాలుఁ డనుభవింప కున్నె.

124


గీ.

మరణ మనునృపాలుఁ డరుదేర ముందఱ
రమణఁ బలిత చామరములు వీవ
దొరసి రోగదోషదుఃఖసేనలు వేగ
నరుగుదెంచు చుండు ననఘచరిత.

125


వ.

మఱియుఁ గాలం బెట్టి దనిన.


గీ.

ఎలమి సంసారమున సుఖ మింత లేదు;
ఎట్టకేలకు నది జనియించెనేని,
కాలుఁ డెడ సొచ్చి తా నది గ్రోలు చుండుఁ,
దఱిమి తంతుల నెలుకలు గొఱుకునట్లు.

126