పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

203

     నామణి ప్రత్యక్ష మై చేతి కబ్బినఁ
                    గని యాత్మసంశయమున నతండు
     నిమ్మణి యిటువేగ యిది యెట్లు వొందెడు
                    నని యూరకుండిన నదియు మఱలె,
గీ. నతఁడు మఱియును బహుతపం బాచరింపఁ
     గన్నులకుఁ దోఁచె నొక మంచి గాజుపూస,
     యిదియ సురరత్న మని యిచ్చ నెంచి దీన
     నఖిలసుఖములఁ బొందెద నని తలంచె.155
వ. అట్ల నీవు సర్వశాస్త్రకోవిదుడవు గావున తత్త్వజ్ఞానివై యకృత్రి
     మం బగు సర్వకర్మపరిత్యాగంబు చింతామణిగా నెఱుంగుము. సక
     లదుఃఖంబుల నణంచెడు నని రాజ్యపరిత్యాగంబు సేసి పురంబు విడిచి
     దూరం బగు మాయాశ్రమంబునకు వచ్చినాఁడవు. తత్త్యాగంబు పరి
     పూర్ణంబు గాఁ జేయవేని యాకాశంబు నంబుదంబు లాశ్రయించు
     భంగిని సంకల్పవికల్పంబులు నిన్నుం బొదువఁగలయవి.156
మ. ఇవి యె ట్లెక్కడ దుష్కరంబ యను ని ట్లీచింతల న్నిచ్చలున్
     మదిఁ దాత్పర్యము లేమి సంశయము సంపన్నం బగున్; దాన నొం
     దదు సంకల్పవివర్జనంబు, పరమానందోదయం బంద, దా
     యది లేకుండిన గాజు రత్న మని డాయం బోవున ట్లౌ జుమీ.157
వ. అమితం బగు నానందంబు విడిచి దుఃఖసాధనంబు లగుమిథ్యావస్తువుల
     యందు వేడ్క సేయునట్టి జనుండు హాస్యాస్పదుం డగు. నీవును
     చింతామణిం బొందెదఁ గా కని తలంచి యొక్కస్ఫటికోపలంబునుం
     బొందితివి. అని కుంభుండు శిఖిధ్వజునకుఁ జింతామణ్యుపాఖ్యానం
     బెఱిఁగించి; చిత్తత్యాగాత్మకం బైన సకలత్యాగంబుకంటెఁ బురుషార్థ
     సమాప్తి వేఱొక్కటి లేదు; ఈ యర్ధంబున గజవృత్తాంతంబు సెప్పెద,
     నాకర్ణింపు; మని యి ట్లనియె.158