పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

211

క. ఆదేవి దివ్యదృష్టి మ
     నోదయితునికర్మబంధనోదన మిఁక న
     ష్టాదశనమలకు నగు నని
     మోదిలె; నట నతనిచిత్తమున శమ మొందన్.142
వ. ఇవ్విధం బంతయుఁ దన దివ్యజ్ఞానంబునఁ దెలిసి, చూడాల యొక్క
     బ్రహ్మచారి యై నిజేశుముందట నిలిచిన నమ్మహీపాలుండు.143
చ. కలయఁ బసిండి లేపమునఁ గట్టినరూపముఁ బోలి, మేనిపై
     దెలు పగుజన్నిదంబు నునుఁదెల్లనిగోఁచియు నుత్తరీయమున్
     వెలిఁగెడుతారహారమును వేలిమిబొట్టును నూర్ధ్వపుండ్రమున్
     బొలుపుగఁ, బాదముల్ ధరను మోపక వచ్చిన విప్రనందనున్.144
క. కని పూజించిన, నాతఁడుఁ
     దన నేమం బడుగ, భక్తిఁ దత్పతి మీ ద
     ర్శనమున ధన్యుఁడ నయ్యెద
     ననఘా నీ వెవ్వ రనిన, నవ్వటు వనియెన్.145
వ. ఏను నారదపుత్త్రుండ నన, నన్నరపతి యమ్మహాముని కెట్లు పుత్త్రుండ
     వై తెఱింగింపవే యన, నక్కుమారుం డి ట్లనియె.146
ఉ. నారదుఁ డొక్కనాఁడు మును నాకనదిన్ విహరించుచో మరు
     న్నారులు నీటులో వివససంబులతో రమియింప వారి యా
     కారము లెల్లఁ జూచి ముని గ్రక్కున సంస్ఖలనంబు నొందినన్
     గోరి యమోఘవీర్య మొకకుంభమునం దిడ నందుఁ బుట్టితిన్.147
వ. కుంభుం డనువాఁడ నా తెఱం గెఱింగించితి. నీ వెవ్వండ! వీపర్వతంబున
     నేల యున్నాఁడ? వనిన, నవ్వటువున కమ్మహీపతి యి ట్లనియె.148
మ. విను విప్రోత్తమ యే శిఖిధ్వజుఁడఁ బృథ్వీపాలుఁడన్, భూమిపా
     లన వర్జించి పునర్భవైకభయడోలాలోలచిత్తుండనై