పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

179

     విచిత్రం. బట్లు గావున సకలభువనభూషణుండ వై యాత్మారామసుఖం
     బు లనుభవింపు,' మని యవ్వాయసయోగి నామంత్రణంబు చేసి, చను
     దెంచితి, నట్లు గావునఁ బ్రాణనిరోధంబునను జిరకాలజీవులు జీవన్ము
     క్తులు నై సుఖియింతు రని యెఱింగించి వసిష్ఠుఁడు.37
క. భూనాథ యీ భుసుండా
     ఖ్యానము వినఁ గాంచుపుణ్యకర్ముల కచల
     జ్ఞానంబు సంభవించుఁ జి
     దానందసుఖంబు లొందు నంబుజనయనా.38
వ. అని భుసుండోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి, యిట్టి చిత్త
     విశ్రాంతిరూపం బైననిర్వాణంబు దేవపూజ నైన సంభవించుఁగావున
     తత్కథాక్రమం బెఱింగించెద నాకర్ణింపు. మని వసిష్ఠుండు రామ
     చంద్రున కి ట్లనియె.39
చ. తిరముగ శయ్య నుండి పెరదేహముతోఁ గలలోన దిక్కులన్
     దిరిగెడునట్లు గాని, యొకదేహమునం దిర మొంద దాత్మ; సం
     సరణము నిట్ల దీర్ఘ మగుస్వప్నము, దీర్ఘమనోభ్రమంబు, దీ
     ర్ఘరమితచిత్తరాజ్యమును, గా మదిలోనఁ దలంపు రాఘవా.40
వ. అదియునుం గాక.41
ఉ. చచ్చుట నిక్క మందఱకుఁ, జావునకై పరితాప మేటికిన్?
     వచ్చుధనం బవశ్యమును వచ్చును, దాన మదింప నేటికిన్?
     గ్రచ్చర రాగరోషభుజగంబులు రెండు మనోబిలంబునం
     జొచ్చి కలంపఁగా నెఱుక చొప్పడ కున్నది గాక, రాఘవా.42
క. చతురులు శాస్త్రప్రజ్ఞా
     రతులును నై రాగరోషరక్తు లగుదు రే,
     నతిభారవాహిగార్దభ
     గతి సదృశులె కాన వారిఁ గాల్చనె తండ్రీ.43