పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జిహ్వాగ్రమునఁ బరీక్షింపంగ లవణాబ్ధికలశార్ణవంబులు దెలియ వచ్చె
నలపున భేదంబు గలుగంగ మృగనాభిహిమవాలుకల నిర్ణయింప వచ్చెఁ
గాని లేకున్న నేకప్రకారమై స, మస్తమును సంతతభ్రాంతి నావహించు
ననఁగ నీశ్వరనారసింహక్షమాధి, పతియశశ్చంద్రికాకదంబములు నిగిడె.

41


చ.

పుడమి హిరణ్యశూన్యదశఁ బొందఁగఁ జేయక విక్రమంబుఁ జూ
పెడుసమయాన మార్మొగము పెట్టక పట్టక దేవతార్థ మె
య్యెడ దయమాలి పుణ్యజనహింసకుఁ బోవక సంచరించినం
గడిమి నృసింహమూర్తి సరిగాఁ దగు నీశ్వరనారసింహుతోన్.

42

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశవిశదగుణా, న్వీతునకు నిరంతరాయవితరణజితజీ
మూతునకు వార్ధివేష్టితభూతలరక్షావతీర్ణపురుహూతునకున్.

43


క.

దంభసరఃకరటికి దో, స్తంభనిశాతాసినటికి సకలధరిత్రీ
సంభారభరణధిక్కృత, కుంభీనసకుంభికూర్మకుహనాకిటికిన్.

44


క.

పౌరుషనాభాగునకు ది, నారంభణభాస్కరప్రభాభోగునకున్
ఘోరాజివిజయభేరీ, ధీరధ్వనిదళితినిఖిలదిగ్భాగునకున్.

45


క.

వాణీకరవీణాని, క్వాణరతికి వినయమతికి వరలక్ష్మీక
ళ్యాణనరసింహవిజయపు, రాణకథారమణతానురాగస్థితికిన్.

46


క.

పరిచితబోధునకు నిరం, తరకాంతఘృణాసనాథునకు సాళ్వశ్రీ
నరసింగవిభుచమూపే, శ్వరనృపతికుమారనరసజననాథునకున్.

47


వ.

అభ్యుదయపరంపంరాభివృద్ధిగా మారచియింపం బూనినవరాహపురాణంబునకుం
కథాప్రారంభం బెట్టిదనిన.

48


సీ.

సకలపుణ్యారణ్యసస్యవాటములు దట్టము లైనపులకాంకురములు గాఁగ
సరసీనదీనవసలిలపూరము శరీరమునఁ గ్రమ్మినకమ్మఁజెమట గాఁగ
జాతసంభ్రమజంతుసంతానకోలాహలములు గద్గదభాషణములు గాఁగ
కికుబంతకరిదంతకాండకాంతిప్రసారంబు వివర్ణభావంబు గాఁగ
జలధికాంచీవరారోహసాత్వికోద, యములఁ బొదలంగ నిజదంష్ట్రికాగ్రబాహఁ
గౌఁగిలించె నిశాచరగంధకరటి, పాకళంబు మహాకుహనైకళంబు.

49


క.

ఈచందంబున జలనిధి, వీచులఁ దనుఁ మునుఁగ నీక వెడలించిన ధా
త్రీచపలేక్షణ వినయ, శ్రీచతురతఁ బలికె హరికిరిప్రభుతోడన్.

50