పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గళము కంబునఁ జేసి తత్కాంతి మందహాసమునఁ బెట్టి తనుమధ్య మంబువాహ
మార్గమునఁ జేసి తత్కాళిమంబు రోమరాజిఁ బెట్టి సృజియించె నీరామ నజుఁడు.

115


క.

స్మరమాంత్రికుండు నిలుపం, గ రానిరోమాళిపన్నగము నిలుపుట దు
స్తర మని తలఁపక వ్రాసిన, బరులు సుమీ యీసరోజపత్రాక్షివళుల్.

116


గీ.

మేచకభుజంగనిభవేణిమీఁదఁ గడచి, వ్రేల నిబ్బాలపిఱుఁదు విరాలి గొలిపె
నన్ను యమునానదీవేణినడుమఁ బాఱఁ, గానఁబడియెడిపులినయుగ్మంబుకరణి.

117


గీ.

అంటుకొనక విలోకింప నాత్మఁ జల్లఁ, జేయునీకాంతతొడలతోఁ జెప్పఁ దగునె
తరము గా నంటుకొనుపాణిఁ దక్క నాత్మఁ, జల్లఁ జేయనికదళికాస్తంభములను.

118


క.

వికచాబ్జదళాగ్రంబుల, మకరందము కరుడు గట్టి మఱి జాఱనిపో
లిక నున్నవిరా సఖ యా, లికుచస్తనిమృదుపదాంగుళీనఖపంక్తుల్.

119


క.

అని పిదప నాసుకేశికి, ననుసంభవ యైనమోహనాకార వధూ
జనచింతామణి నాళీ, కనిభేక్షణ మిత్రకేశిఁ గనుఁగొని పలికెన్.

120


క.

ఈరాజకీరవాణికి, నీరాకాచంద్రవదన యే మౌనో వి
ద్యారక్షక వయసున సుకు, మారత రూపమునఁ గాంతి మార్పఁగ వచ్చున్.

121


గీ.

నద్వితీయంబుగా దీని నలువ చేయఁ, దలఁచి చేయుచుఁ దలఁచినతలఁపుకొలఁది
వచ్చునందాఁకఁ జేసినవారు మేన, కాదిసుతు లన్నుసౌందర్య మడుగ నేల.

122


క.

మధురమధురసాస్వాద, గ్రధితారుణ్యంబు లైనకనుఁగోనలతో
ఢ ధవునిమీఁద నొరగి నవ, సుధాంశుమణిసౌధవీథి సుఖపరవశయై.

123


గీ.

ఇందుబింబాస్య వీణ వాయించెనేని, మృగవిలోచన కిన్నర మీటెనేని
పల్లవాధర మెల్లన పాడెనేని, మూఁడుజగములు రాగాబ్ధి మునుఁగకున్నె.

124


సీ.

అని మహీపతి మన్మథాధీనుఁడై కుమారికులరూపములు వర్ణించువేళ
నైరావతీసమాహ్వయదూతి యేతెంచి కన్యకలార యిక్కాననమున
పోక ప్రొద్దునఁ జరింపుట నీతి యే పురంబునకుఁ బోదము రండు కినిసి మిమ్ముఁ
బిలువంగ నన్నుఁ బంపిరి కన్నతల్లులు నావుడు నమ్మాట నారసంబు
కరణి హృదయంబు నాటినఁ గళవళించి, పాపకర్మపుదైవ మీపాటిమేలుఁ
జూడఁజాలక నిస్తంద్రసుఖవిహార, మునకు విఘ్నంబు గావించె ననుచు వగచి.

125


గీ.

సర్వలోకైకసౌందర్యదూర్వహునకు, మముఁ బరాన్ముఖలను జేయ మగువ నీకుఁ
బాడి గా దని పలికినపగిది నంది, యలు గులుకరింపఁ గొంతద వ్వరిగి నిలిచి.

126


శా.

ఆరాజుం గనువేడ్క చిత్తముల నూటాడన్ విధం బేవిధం
బో రామా ననవింటివేలుపునకుం బుష్పాంజలుల్ సేయ మం