పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అనిన యువరాజు సుద్యుమ్నుఁ డన్నపార్శ్వ, భాగముననుండి చిఱుతకోపంపుఁగెంపు
తనకనుంగవ మొనప ముందరికి వచ్చి, కేలుదోయి శిరంబునఁ గీలుకొలిపి.

23


చ.

అలఘుబలాఢ్యుఁ డయ్యును దయాళువు గావున శాంతచిత్తుఁడై
నిలిచినతండ్రికాలమున నెమ్మది గాదములోనిదోసకా
యలువలె నున్నరాజులు బలారిభయంకర నిన్ను నట్ల కాఁ
దలఁచిరి దాడి పెట్టి భుజదర్పము చూపుము వేయు నేటికిన్.

24


క.

అనవుడుఁ గూరిమితమ్మునిఁ, గని మెచ్చి పురంబు వెడలి కరితురగస్యం
దనభటులతోడు చూచి న, యనభయదస్ఫూర్తిఁ జైత్రయాత్రోన్ముఖుఁడై.

25


సీ.

ఘనఘనాఘనసన్నహనకుహనాఘోణిఘోణాపుటీగుటగుటలతోడఁ
బ్రళయకాలకరాశబహుశిఖాముఖసముద్భటహవ్యవహచిటచిటలతోడఁ
గులధరాధరకూటకోటిపాటనపతద్భీషణాశనిపెటపెటలతోడ
సరభసావిర్భవన్నరహరిస్తంభగర్భస్ఫుటీకృతపటపటలతోడ
నవఘళించి విడంబించి హంకరించి, రాయడించి ధణంధణారవము రత్న
సానుగుహలఁ బ్రతిధ్వను లీన విజయ, పటహపటలంబు చఱపించి పటురయమున.

26


క.

గమనింపఁ దలఁచుచోఁ బొం, దుము విజయం బనుచు నపుడు దూర్వాసుఁడు ల
గ్నము వెట్టఁగ ధవళచ్ఛ, త్రము వెట్టఁగ దుర్జయుండు రథ మెక్కుతఱిన్.

27


సీ.

వెడలె భూధరములవిధమునఁ గోటానుకోటులు మదభద్రకుంజరములు
నడచె వీచికలచందమునఁ బుంఖానుపుంఖములు జవనకంఖాణహరులు
కదలెఁ బుష్పకములకరణి లక్షోపలక్షలు రత్నకాంచనస్యందనములు
చనిరి సింహంబులజాడఁ దండోపతండంబులు వీరభటప్రవరులు
పోయె ముందట నీనినపులులవంటి, రాచబిడ్డలు తనవెంట రా నరాతి
గార్భిణభ్రూణహం బైన కాహళీమ, హావిరావంబు నిగుడ రాజానుజుండు.

28


క.

ఆసమయంబున శేషఫ, ణాసాహస్రంబు ముడిగె నడికె సమస్తా
శాసామజంబు లిట్లు జ, యాసన్నచమూపరంపరాన్వీతుండై.

29


గీ.

నగతనూజాత పెండ్లైననాఁటనుండి, నేఁటిదాఁక నగస్యుండు నిలువఁడేని
నిమ్మహాసేనబరువున నెగయకున్నె, దక్షిణం బన నరిగె నుత్తరమునకును.

30


చ.

అరుగునపారసైనికపదాహతిఁ దూలినరేణువు ల్దిగం
బరత లలాటనేత్రునకు మాన్చె ననంగ నిజాండకర్పరాం
తరమునఁ దోడిభూతములు నాల్గు నడంగిన భూమి తత్వమే
నెరసె ననంగ లోకములు నిండెఁ ద్రివిక్రమమూర్తికైవడిన్.

31