పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అధరాధూళిపాళిచే నబ్జజాండ, భాండము వహించె భూతికరండలీలఁ
జుక్కలు ధరించె మేదిని దుక్కిలోన, విత్తిన విశాఖవిత్తులవిలసనంబు.

32


వ.

ఇవ్విధంబున సకలజగదంధకరణం బైనరజోగణంబు సముద్దండకేతనశిఖరవినిర్భి
న్నజలధరగర్భగోళగళద్వారిధారాభిషేచనంబున నడంగ మృదంగనిస్సాణదుందు
భిధ్వానంబులు మిన్నుముట్ట దాడివెట్టి కౌబేరదిశామహేశానదేశంబుల జనితాక్రో
శంబులం జేసి భారతభద్రాశ్వకేతుమాలకింపురుషకుర్విలావృతరమ్యహిరణ్మయవర్షావ
లంబజంబూద్వీపధరిత్రీకాంతులం బాదాక్రాంతులం జేసి పుష్కరక్రౌంచశాకశా
ల్మలప్లక్షకుశద్వీపంబులభూనాథుల దైన్యసనాథులం జేసి తురాషాడ్జిగీషాసమున్మేషం
బున దుర్జయుండు నిర్జరగిరికూటం బెక్కి మిక్కిలిగర్వంబున గంధర్వులం దూలిచి
గురుడులం గూలిచి కిన్నరులం గొట్టి కింపురుషులం బాడుదలవట్టి సారణుల వెం
టాడించి సాధ్యుల నోడించి విద్యాధరులం భంగపఱచి విబుధులవెన్ను చఱచి
దీర్ఘనిర్ఘాతర్ఘోషప్రతిభటాట్టహాసంబున దిక్కులు గ్రక్కదలఁ గదలి కదళీకాంతా
రంబు చొచ్చినమదాంధగంధసింధురంబునుం బోలె మీటు మిగులునమ్మేటిమ
గనిం గాంచి కాంచనగర్భసంభవుండు నిర్భరాహ్లాదంబునఁ గుంచె సారించి యింత
కాలంబునకు నీబుభుక్ష దీఱ మదీయవీక్షణంబులకు జగడంపుఁగూడు కుడువం గలిగె
నని లేటికొదమచందంబునఁ జంగుచంగునం దాఁటుచు నందనోద్యానంబునఁ గల్ప
వృక్షంబులనీడం గ్రీడించుబిడౌజుపాలికి హుటాహుటిం జని యిట్లనియె.

33


చ.

మఱి పని లేదె వేసరవు మాటికి నిక్కడ నుండ నోయి చే
టెఱుఁగనికూన దుర్జయనరేంద్రశిఖామణి వీఁడె వచ్చె నే
వెఱపును లేక వేలుపుల వెంపర లాడుచు నాలకింపు మా
మొఱలు తదీయధాటి నిను ముట్టుఁ జుమీ నిమిషంబు నిల్చినన్.

34


క.

నావుడు నింద్రుఁడు బెగడకు, నీవు సువర్ణాద్రి యెక్కి నిర్భయమున నా
పై వచ్చు నఁట నరాధముఁ, డీవింతలు వినఁగ వలసె నేటికి మాటల్.

35


చ.

ప్రమథగణంబుఁ దాను హిమభానుకళాధరుఁ డెత్తి వచ్చినం
దెమలక నిల్తు నారదమునీ చలియింపుదునే మనుష్యమా
త్రమునకు వీఁడు మున్ను బవరంబున నాకరవజ్రధారచే
సమసినపాకవృత్రబలజంభపులోములకంటె నెక్కుడే.

36


గీ.

అనిన విని నారదుఁడు నీమహానుభావ, మే నెఱుంగుదు రిపుఁ డల్పుఁ డైన నధికుఁ
డైన నుండంగవలయు మహాప్రయత్న, మున నయజ్ఞానపరులకు ననిమిషేంద్ర.

37