పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భిక్షాప్రదానవినోదనపరిగృహీతపురంధ్రీరూపవిహరమాణవిశాలాక్షీచరణకంజమణి
పుంజకిరణమంజరీపింజరితమంజుమంజీరశింజితముఖరవిశిఖాముఖంబును మణికర్ణికా
సరఃపద్మకర్ణికావిలీనశిలీముఖంబును డుంఠివేదండతుండతుండజనితశీకరప్రకరనిరం
తరతారకితనభోవకాశంబును ఘంటాపథప్రతినిశీధచరత్కాలభైరవారక్షకపురః
కరదీపికాసహస్రప్రకాశంబును శిఖగుంభితశాతకుంభకుంభామ్రేడితగగనకల్లోలి
నీకనకజలజాతగోపురంబును నైనవారణాసీపురంబున దుర్జయుఁ బట్టంబు గట్టి బుద్ధి
మంతుల సకాశంబునం బెట్టి సుద్యుమ్ను యౌవరాజ్యంబున నిలిపి నృపనీతివాక్యం
బులు దెలిపి సర్వసంగపరిత్యాగంబు గావించి తపం బవస్యకర్తవ్యంబుగా భావించి విర
క్త్యంగనాలింగితప్రతీకుండు సుప్రతీకుండు సకలకాలకిసలయకుసుమఫలభరితనగం
బునకుఁ బితృకూటనగంబునకుం జనియె నంత నిక్కడ.

16


గీ.

దుర్జయుుడు ధరిత్రీవధూటిఁ బిలువ, రాచవారివిపద్గతి చూచి బెగడి
చేర వచ్చిన సౌఖ్యలక్ష్మీపరంప, రాస్పదం బైనతనబాహు నాదరించి.

17


చ.

ఎనిమిదిదిక్కులన్ గుణము లెన్నిక కెక్క భుజాపరాక్రమా
ర్జనపరతంత్రచిత్తమున రాజ్యము సేయుచు నొక్కనాఁడు క
మ్మనిహిమవారిపూరమున మజ్జన మాడి దుకూలపుష్పచం
దనమణిభూషణావళులు దాల్చి నిజావరజానుయాతుఁడై.

18


క.

ధళధళ మను వెన్నెలలం గలకల నగుచామరములు కరకమలములం
గలకలకంఠీజనములు, గొలగొల రా వచ్చి కొలువుకూటములోనన్.

19


స్రగ్ధర.

ఆసుద్యుమ్నాగ్రజన్ముం డధిగతమణిసింహాసనుండై సభాసీ
మాసేవాసన్ననానామనుజపతిహితామాత్యులం జూచి మిథ్యా
హాసాంకూరోద్గమం బాస్యమున మెఱయ నేత్రాంతముల్ గోరబాఱన్
మీసంబుల్ దీడి పల్కెన్ మృగపరివృతగంభీరనాదంబుతోడన్.

20


సీ.

భారతవర్షధాత్రీరమణులు మన నొల్లరో కొలువ రాకుంట యెట్లు
హరివర్షకువలయాధ్యక్షులు బ్రదుకంగ నొల్లరో కొలువ రాకుంట యెట్లు
భద్రాశ్వవర్షభూభర్తలు ప్రాణంబు లొల్లరో కొలువ రాకుంట యెట్లు
రమ్యవర్షవసుంధరావల్లభులు తల లొల్లరో కొలువ రాకుంట యెట్లు
బవరమున వారు నావాలుపాలుగాక, శరణు చొరఁ గేతుమాలకింపురుషకుర్వి
లావృతహిరణ్మయాఖ్యవర్షావనీశు, లొల్లరో తారు కొలువ రాకుంట యెట్లు.

21


క.

తనతోడిదిక్పతులుఁ దానును గతహంకారుఁ డై ననుం గనఁ డింకన్
వినఁడు సుమీ నే సింహా, సన మెక్కినవార్త పాకశాసనుఁ డహహా.

22