పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తన్వీ విను సింధుద్వీ, పాన్వయజుఁడు మహిషదానవాగ్రణి దోర్డ
ర్పాన్వీతుఁడు స్వాయంభువ, మన్వంతరవేళ విష్ణుమాయాహతుఁడై.

52


క.

ధర వైవస్వతమన్వం, తరమున వెండియును బట్టి నందాశక్తిన్
దురమున వింధ్యక్షోణీ, ధరసీమ నెదిర్చి చచ్చెఁ దచ్ఛూలమునన్.

53


గీ.

జ్ఞానశక్తి యనఁగ సావిత్రి యనఁగ వై, ష్ణవి యనంగ వివిధనామకముల
నున్నమాయలీల లెన్నంగ రా దర్ణ, వములయిసుక యెన్నవచ్చుఁ గాని.

54


సీ.

వసుధా నవగ్రహవ్రతములు విను మింక సంయుక్తహస్తనక్షత్ర మైన
భానువారంబునఁ బ్రారంభ మొనరించి క్రమమున భానువారంబు లేడు
నక్తంబు నియతితో నడపి యేడవవారమున యథాశక్తి జాంబూనదమున
రవిఁ జేసి రక్తవస్త్రద్వయంబును జుట్టి నేత మజ్జన మార్చి నిష్ఠఁ బూజ
చేసి గొడుగును బావాలుఁ జేలమును వి, భూషణంబులు మొదలుగా భూసురునకు
నిచ్చి బ్రాహ్మణభోజనం బిడినసువ్ర, తునకు నారోగ్యసంపదల్ దొరకు నెపుడు.

55


వ.

చిత్తానక్షత్రసహితం బైనసోమవారంబు మొదలుకొని యెనిమిదిసోమవారంబులు
పాయసంబున నక్తంబు సలిపి యెనిమిదవసోమవారంబున నోపినపాటి వెండి నిందు
మండలంబు చేసి ధవళవస్త్రయుగంబునం బొదిగి కాంస్యభాజనంబున నిలిపి పాదు
కాతపత్రదక్షిణాసహితంబుగా విప్రపుంగవునకు నొసంగి బ్రాహ్మణభోజనంబు పెట్టిన
సువ్రతులు కాంతిమంతు లగుదురు స్వాతినక్షత్రసహితం బైనభౌమవారంబు మొ
దలుకొని తొమ్మిదిభౌమవారంబులు నక్తంబులు సలిపి కడపటివారంబున యథాశక్తి
సువర్ణంబున నంగారకప్రతిమం జేసి రక్తవస్త్రద్వయంబునం బొదిగి తామ్రభాజ
నంబున నిలిపి దక్షిణాలంకారపాదుకాఛత్రసహితంబుగా భూసురున కిచ్చి బ్రా
హ్మణభోజనంబు పెట్టినధన్యులకు సకలశుభంబులు గలుగు నిట్ల నక్షత్రానుక్రమం
బునం దక్కినగ్రహంబుల వారంబు లేకోత్తరవృద్ధిగా నక్తంబులు సలిపి తత్తద్గ్ర
హోచితవర్ణలోహవస్త్రాదికంబుల నుద్యాపనంబు చేయుననవద్యులకు నవగ్రహాను
కూల్యంబు నాయురారోగ్యైశ్వర్యాభివృద్ధులుం గలుగు నీనవగ్రహకల్పంబు వినిన
వారికి నిష్టఫలంబులు గలుగునని చెప్పిన విని ధరిత్రి కపటపోత్రి నాలోకించి.

56


గీ.

దేవ మున్ను నీవు దెలిపినద్వాదశీ, వ్రతము పూని చేయ వర్షసాధ్య
మది నిరంతరాయమై సాగు టరిది త, త్ఫలము సులభవృత్తిఁ గలుగువ్రతము.

57


ఉ.

ఆనతి యి మ్మటన్న వసుధా వినిపించెద నీకు నే నుపా
ఖ్యానము ము న్నిలావృతసమాహ్వయవర్షవిభుండు శ్వేతుఁ డం
భోనిధిమేఖలావలయముద్రితసర్వవసుంధరానృపా
స్థాననమస్కృతస్వభుజశాసనుఁడై జగ మెల్ల నేలుచున్.

58