పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నావుడు నాకుహనావరాహుండు కాశ్యపికి ని ట్లనియె నాసత్యతపుఁడు
భృగువంశజుం డైనపృథ్వీసురుండు యౌవనవేళఁ బ్రాప్తదుర్వ్యసనుఁ డగుచు
జారుఁడై నిజకులాచారం బుడిగి పాపపరత వర్తించుచు నరుణిమౌని
కారుణ్యసంపదఁ గలిగినవిజ్ఞాన మెఱిఁగి దుర్వాసోమునీంద్రువలన
హరిచరిత్రంబు విని తుషారాద్రియుత్త, రమునకును బోయి పుష్పభద్రాతరంగి
ణీతటమునఁ జిత్రశిలాతలమున, భద్రనామకవటపాదపంబునీడ.

23


క.

కడునియతిఁ దపము చేయుచు, నడవికి నొకదినమునందు నరిగి సమిత్తుల్
కొడవంటఁ గోయునురవడిఁ, దడఁబడి తనవామహస్తతర్జని దెగినన్.

24


గీ.

కైకొనక సమిధలు తొంటికరణిఁ గోయు, చుండె ఖండితతర్జనిగుండ నెత్తు
రెముక మొదలుగ లేదయ్యె నించు కైన, భూతియె వెడలె నౌర తపోవిభూతి.

25


క.

నేలఁ బడియున్నతునుకయు, వేలం దనదానె తొంటిక్రియ నంటె నతం
డాలోన హోమసమిధలు, చాలం గోసికొని పర్ణశాలకు వచ్చెన్.

26


చ.

ఇర వగునట్టిభద్రవటవృక్షముకొమ్మలమీఁద నున్నకి
న్నరమిథునంబు నెమ్మనమునన్ గడువిస్మయ మందుచున్ మునీ
శ్వరుమహిమంబు గన్గొని దివంబున కేగి సమస్తదేవతా
పరివృతుఁ డైనయింద్రునిసభాభవనంబున నుండ నత్తఱిన్.

27


క.

బలభేది కొలువువారలఁ, గలయం బరికించి మీరు గనినవినినక్రొ
త్తలు చెప్పుఁ డనిన వినతాం, జలియై కిన్నరయుగంబు సవినయఫణితిన్.

28


గీ.

సత్యతపునివ్రేలు సమిధలతోఁ గూడఁ, దెగినవిధము భస్మ మెగయువిధము
ధరణిఁ బడ్డతునుక తనుదానె కీల్కొన్న, విధముఁ దెలియ విన్నవించుటయును.

29


ఉ.

ఇంద్రుఁడు విస్మయంబున నుపేంద్రునితో నిది చూడ నామదిన్
సాంద్రకుతూహలంబు కొనసాగుచు నున్నది పోయివత్తమ
న్నం త్రిజగద్విభుండును ఘనాఘనగర్జితఘుర్ఘురంబుతోఁ
జంద్రకళావినిర్మలవిశంకటదంష్ట్రలతో వరాహమై.

30


సీ.

తనదేహవిస్తారమున ముజ్జగము నైన నాక్రమింపదె యీమహైకలంబు
తనలావు కలిమి గోత్రమహీధరము లైన లీల నెత్తదె యీకరాళఘోణి
తనభయంకరమూర్తిఁ బెనురక్కసుల నైన వెఱపించుకొనదె యీవికటదంష్ట్రి
తనపాదహతి ఫణీంద్రఫణభాగము లైన నలియఁ ద్రొక్కదె యీమదాంధపోత్రి
యసదృశం బగుతనగతి నొసలఁ గన్ను, గలుగునంతటిబలువేఁటకానిసార
మేయముల కైనఁ బట్టీక మీటు మిగిలి, చనదె యీఘోరభూదార మనఁగ నపుడు.

31