పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

డుంఠిబృంహితరవాటోపంబె కాని సంవర్తధారాధరధ్వనులు లేవు
కదళికావనవాటిఁ గదలు గాడ్పులె కాని ప్రళయప్రభంజనారభటి లేదు
గోపురసౌవర్ణకుంభకాంతులె కాని తీవ్రతక్షయాదిత్యదీప్తి లేదు
విశ్వేశమజ్జనవిమలవాఃపూరంబె కాని కల్పైకోదకంబు లేదు
క్రోశపంచకపరిమితక్షోణికలిత, మైనయేపట్టణంబున నట్టికాశి
కరిగి గంగానదీస్నాన మాచరింప, హరునిచే నుండి మహి జాఱె నజునిపునుక.

17


క.

కమలజుశిర మీకైవడిఁ, దెమలి మహిం బడినవేళఁ ద్రినయనహస్తం
బమరె నపేతమరాళా, క్రమణం బగువికచరక్తకమలముభంగిన్.

18


క.

ఈనిఖిలంబునఁ గలిగిన, ప్రాణులపాతకము సంస్మరణమాత్రమునన్
మానుపు మలహరుదురితము, మానిపె నీవారణాసిమహిమం బసదే.

19


చ.

అని సవిధస్థితుల్ పొగడి రప్పుడు బ్రహ్మ సమస్తదేవతల్
దను గొలువంగ వచ్చి హిమధామశిఖామణిఁ జూచి ఫాలలో
చన భవదీయహ స్తమున జాఱె గపాలము లోకముల్ నుతిం
ప నిచటఁ దాల్చు నీస్థలి కపాలవిమోచనతీర్థనామమున్.

20


వ.

మఱియు వినుము మొదలు నీవు కపాలపాణివై సకౌపీనంబుగా వసుంధరం బరిభ్ర
మించుట మహావ్రతం బనం బరఁగు నావెనుక నగ్నత వహించి తిరుగుట నగ్న
కాపాలికం బనం బరఁగు నందుపిదప బభ్రుత వహించుట బభ్రుకపాలికం బనం
బరఁగు నిప్పుడు గంగానదీస్నానంబున దేహశుద్ధి వహించుట శుద్ధశైవం
బనం బరఁగు బ్రహ్మహత్యకు మునుపు నీలత్వసహితుండ వగుట కైదారవ్రతం జనం
బరఁగు సకలపాపక్షయకరంబు లైనయేతన్మహావ్రతంబులకుఁ దగినశాస్త్రంబులు
మత్పురోగము లయినవేల్పుగములకు భావికాలంబున నుపదేశించి సకలలోకాచరణ
యోగ్యంబులు చేయు మని పలికి బహువిధంబులం బ్రస్తుతించి విరించి నిజలోకం
బునకుం జనియె రుద్రుండును మహేంద్రాదిబృందారకులు జయజయాలాపకోలా
హలంబులతో సుభయపార్శ్వంబుల సేవింప భావింప గోచరంబు గాని మహిమం
బున రజతాచలంబునకు విజయం చేసి చరాచరంబు లేలుచుండె మేదినీవేదరహ
స్యం బైనయీరుద్రమాహాత్మ్యంబు చెప్పితి నింక నేమి వినవలతు వడుగు మనిన.

21


మ.

అవనీకామిని ఫాలభాగమున హస్తాంభోజముల్ చేర్చి ది
వ్యవరాహాధిపుఁ జూచి దేవ మును దుర్వాసోమునిస్వామిచే
వివిధశ్రీశ్రమహత్త్వముల్ విని హిమోర్వీభృద్వరాభ్యర్ణపు
ణ్యవని న్నిల్చిననాఁటిసత్యతపుఁ డే మయ్యెం గృపం జెప్పవే.

22