పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అలినీఝంకృతిమంత్రపూర్వకముగా నాశాంతధాత్రీసుప
ర్వులకుం బల్లవపాణులం దొరుఁగు పువ్వుందేనె యన్నీటిధా
రలు వోయు న్నవమంజరీపరిమళద్రవ్యంబు లవ్వీటఁ గ
ల్పలతల్ పౌరవధూవిలాసగరిమప్రాప్తివ్రతాయత్తతన్.

150


క.

పురి విచ్చి మయూరము ల, ప్పురిసౌధశిరోగృహాగ్రముల నటియించున్
బరిసరశయితవధూటీ, సురతశ్రమ మడఁగ విసరుసురటు లనంగన్.

151


క.

తమమాటలతో సరియగు, నమృతరసము ముంచి యిత్తు రమరఁగ మణికుం
భములఁ బ్రపాపాలిక లని, శముఁ దత్పురరాజవీథిఁ జలిపందిళ్ళన్.

152


వ.

ఈవిధంబున నత్యద్భుతమహిమాకరం బగునప్పురంబుం గలయం దిరుగుచు ముం
దట బృందారకగంధర్వసిద్ధవిద్యాధరప్రముఖదివ్యకన్యకానికాయకేళీకోలాహల
సంకులంబు లైనకెలంకులం గలకొలంకులలోన నొక్కసరోవరతీరంబున నే మున్ను
చూచిన కుటియును జటియునుం గనంబడ విస్మయంబున డాయం బోయి సవిన
యంబుగాఁ బ్రణమిల్లి మహానుభావా భానుసోమరుద్రాజమరుద్రాజాదిలోకంబులు
చూచితిం గాని యేలోకంబుల నిట్టిక్రొత్తలు లేవు నీ విలావృతవర్షంబుననుండి
యిచ్చటి కెట్లు విచ్చేసితి వనిన నమ్మునీశ్వరుండు లేనగవు సెలవి మొలవం జలువ
చూపులం జూచి యీచరాచరంబు జలరూపంబున నావరించి వరుణాభిధేయం
బున మెలంగునారాయణుండ నీవు నన్ను సప్తజన్మంబులనుండియు నారాధించిన
ధన్యుఁడవు గావున దేవతలకు నగోచరం బైనయీమదీయభవనంబు చూపితి నిఁక
నేతద్దర్శనఫలంబున నీకు నేకాలంబునం జేటు లేదు పొ మ్మని పలుకునవసరంబున
నిద్రాముద్రితలోచనుండనై ధరాభాగంబునం బడి యించుకవడికి మేల్కాంచి
కాంచనగిరిశిఖరంబున సప్తద్వీపకులశైలవసుంధరాసమేతం బగునప్పురంబున మౌని
పుంగవుం జూచితి నాఁటనుండియు నచ్చిత్రకృత్యంబు మచ్చిత్తంబున నచ్చొత్తిన
విధంబున నుండు మహీమండలాఖండలా యేతద్రహస్యంబు నీకుం జెప్పితి నని
కుంభసంభవుండు భద్రాశ్వునకుఁ జెప్పె నని వరాహదేవుండు చెప్పిన విని ధరా
మధురాధర తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

153


ఉ.

 యుఝ్ఝడితిప్రయుక్తరిపుయూధశిరోధివిరోధిఖడ్గపీ
తోఝ్ఝితరక్తపూరమిళనోల్బణనిద్రుమకాంతిభృత్సర
స్వఝ్ఝరవఝ్ఝళంఝళరవస్ఫురదంగదభూష రూపసం
పఝ్ఝషకేతుసన్నిభ సభాభవనాబ్జవనీరవిప్రభా.

154