పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విప్పగుశబ్దంబువలన రెండుమేనులు నాఱుమోములుం బండ్రెండుచరణంబులుం గల
నరుం డొక్కరుం డవతరించె నతనివలన సంపన్నం బైనదాంపత్యం బహోరాత్రం
బనం బరంగె నిప్పగిది నెప్పటియట్ల ఱెప్ప పెట్టినయంతలోనన కానవచ్చునచ్చ
రాచరంబునకు నచ్చెరు వంది వందిచందంబున నరవిందభవనందనుండు గోవిందు
నందంద పరమానందంబున వినుతించి పరమపురుష నిమిషంబునన యిజ్జగం బెక్కడ
నడంగె నెక్కడం బొడమె నానతి మ్మని విన్నవించినఁ బ్రసన్నుండై వెన్నుం
డన్నారదు విలోకించి తత్వంబులు పరమయోగులచిత్తంబుల నడంగుభంగి మదీయ
సంధాసమాధిసమయంబున జగంబులు నాయందు డిందు నది మర్త్యామర్త్యప్రళ
యంబు బ్రహ్మ రాత్రి నిద్రించువేళ నాకు జపసమయం బది యోగిక్లేశసంక్షయం
బగుమధ్యమలయం బనం బరఁగు బ్రహ్మకు వత్సరంబులు నూఱు నిండిన మహాప్రళ
యం బది ముక్తికాలంబు బ్రహ్మకు నొక్కయేఁడు నా కొక్కనాఁడు మునీంద్రా
మున్ను నన్ను సప్తజనంబులనుండి యారాధించినాఁడవు గావున సంధ్యారూపం
బున నతిరహస్యం బగు నామాయ నీకుం జూపితి నింతియకాని నాకు నొక్కసం
ధ్యయు నుపాస్యంబు లేదు సకలదైవతంబులు నాయందుఁ బొడము నడంగు నేన
శైవవైష్ణవకాపాలికాదిమతంబులవారిచేతం బూజ గొందు నీవు నావిరూపంబున
బహుసహస్రవర్షంబు లనుభవించిన సంసారంబునుం జరాచరసృష్టిసంహారంబును
నేకక్షణంబున నే చూపితి నమేయమదీయమాయావృతులై బ్రహ్మపుత్రాసుత్రా
మాదిదేవత లవిరతద్వంద్వపరాయణత్వంబునం గామక్రోధబాధితు లగుదు రిట్టి
నామాయావిహారం బెఱిఁగిన పురుషుండు పరుషతరసంసారం బనుకడలి వెడలి కడ
లేనికైవల్యం బనుభవించు ననిన మునివర్యుండు సాశ్చర్యుండై.

115


సీ.

నారాయణా నిన్ను నాల్గుజాతులవారు నేరీతి భజియింతు రెఱుఁగ నాన
తిమ్మన్నను గృపాసమేతుఁడై దేవుండు ద్విజులకుఁ బురుషసూక్తజపనియతి
భజియింపఁ దగుఁ దజ్జపం బలబ్ధం బైనఁ బాంచరాత్రమతప్రపంచమున భ
జింపంగఁ దగుఁ జెవిఁ జేర్పఁగాఁ గాదు శూద్రజనంబునకుఁ బాంచరాత్రమతము
నూట వేయింట నొకఁడు పుణ్యుండు గలిగె, నేని వానికి సిద్ధించు నీమతంబు
వానిహృదయంబులో నుందు వనధికన్య, చన్నుఁగవ నుండుకంటెను సమ్మదమున.

116


క.

కావున నీమతమునఁ గా, నీ వేదప్రోక్తయజ్ఞనిర్మితిఁ గానీ
సేవించి నన్నుఁ గందురు, దైవతములు గాన లేరు తక్కినజాడన్.

117


గీ.

అనుచు వచియించి దుర్లభం బైనపాంచరాత్రశాస్త్రంబునకుఁ బ్రవర్తకుఁడు గాఁగ
నారదు ననుగ్రహించి లక్ష్మీరమణుఁ డ, దృశ్యుఁ డయ్యె మునీంద్రుండు దివికి నరిగె.

118