పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

స్పష్ట్యర్థము మీనకమఠ, ఘృష్ట్యాదిశరీరములు ధరించితి వింతే
దృష్ట్యాలక్ష్యమె కరుణా, వృష్ట్యంబుద నీదురూపు వివరింపంగన్.

40

క్షురికాబంధము

క.

శ్రీహరి హరిహయనుత మహి
మాహిత హిమధామభానుమండలనయనా
నాహృదయములో నిలువు స
మాహితకృప నెప్పుడున్ మహాహిపశయనా.

41


చ.

అనుచు ననేకభంగుల మహామమహీజముక్రింద నుండి సు
స్వనశుకశారికల్ ఫలరసంబులు గ్రోలక ధారణాబలం
బునఁ దనవెంబడిం జదువ ముమ్మరమై పులకాంకురావలుల్
తనువున మీఱ బాష్పసలిలంబులు గాఱ నుతింపుచుండఁగన్.

42


సీ.

బ్రహ్మ మధ్యస్థుఁడై పరికింపఁ గుండలీశ్వరుఁ క్రిందు పఱచినశాబ్దికుండు
బలిహరణపువేళఁ బ్రాపించువిబుధుల నరయుసంపన్నగృహస్థవరుఁడు
ధరకుఁ దా నొకరుండ దానపాత్ర మనంగ మఖము లీడేరించుమంత్రమయుఁడు
వేదవేదాంగాదివిద్యలలోనన పుట్టి పెరిఁగినట్టి గట్టియోగ్యుఁ
డతులసాత్వికవర్తనుం డాత్మపాద, తీర్థములు చల్లుకొనెడికృతార్థతతికి
జాహ్నవీస్నానపఫలము లీఁ జాలు పరమ, పావనుం డొకమఱుగుజ్జుబ్రాహ్మణుండు.

43


ఉ.

వచ్చుటయున్ ఫలందనుఁడు వారిజనాభుఁడె మాయదారియై
యిచ్చటి కేగుదెంచె నని యిచ్చఁ దలంచి నమస్కరింప వై
యచ్చరకామినీకరనఖాంకురలూనవిలోలపల్లవా
త్యుచ్చతరామ్రభూరుహము దోఁచె రయంబున జానుదఘ్నమై.

44


గీ.

అది గనుంగొని భూపాలుఁ డద్భుతమున, వేయు నేటికి నితఁడె నారాయణుండు
నిక్కువం బని చాఁగిలి మ్రొక్కి దేవ, చూపు నీరూపు నా కింక దాఁప కనిన.

45


సీ.

గడితంపునీర్కావిమడుగుదోవతి కటీరస్ఫురత్పీతాంబరంబు
కురుమట్ట మగునూఁతకోల ధగద్ధగత్కౌమోదకీగదోత్తమము గాఁగ
జలము నిండినకమండలము ఘనస్వనాడంబరకంబురాజంబు గాఁగ
గుత్తంపువట్రువగొడుగు పరాక్రమక్రమనిదర్శనసుదర్శనము గాఁగ
స్వస్తిఫణితుల దీవింపఁ జాఁపుకరము, సకలకామితవరదహస్తంబు గాఁగ
సరసిజాక్షుండు కరుణ సాక్షాత్కరించి, రాజ వేడుము వలయు వరంబు లనిన.

46


క.

జలధిసుతాధిప నీకృప, గలిగిన సజ్జనుల కిజ్జగంబులు దలఁపం
దిలమాత్రము గాన వరం, బులు దక్కిన వడుగ నొల్ల మోక్షము దక్కన్.

47