పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

వరాహపురాణము

నవమాశ్వాసము

క.

శ్రీవనితావరభావన, పావనితాంతఃకరణ కృపానిత్యవినా
భావనితాంతబలాఢ్య ప, రావనితాపకర యీశ్వరాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు వసుధ కి ట్లనియె నట్లు సత్యతపోముని దూర్వా
సువలన విచిత్రం బైనధరణీవ్రతచరిత్రంబు విని ధన్యుండ నైతినని తదనుమతంబున
హిమగిరిపరిసరంబునకుం జని పుష్పభద్రాభిధానధునీకనకసౌగంధికగంధబంధుర
మంథరగంధవాహసమాగమంబుల భద్రనామధేయవటవినిద్రచ్ఛాయావిభ్రమంబులఁ
జిత్రాహ్వయశిలాస్థలవిశ్రమంబుల జననజ్ఞా నిదాఘపరిశ్రమంబు నడంచునొక్క
పుణ్యాశ్రమంబునఁ బరబ్రహ్మ విద్యానుసంధానపరుండై నిలిచె నతనిచరితంబు
లత్యద్భుతభరితంబు లవి మీఁదట నెఱింగించెద.

2


క.

అనిన విని ధరణి వినయం, బునఁ గల్పసహస్రములకు మునుపట నేఁ జే
సీనయీసువ్రతము దలం, పునఁ బడియె భవత్ప్రసాదమున జగదీశా.

3


గీ.

నాఁడు దనకుఁ బద్మనాభవ్రతము చెప్పి, తీర్థయాత్ర పోయి తిరిగి వచ్చి
నపు డగస్త్యు నేమి యడిగె భద్రాశ్వుఁ డ, మ్మౌని యేమి పలికె నానతిమ్ము.

4


మ.

అనినం గైతవపోత్రి ధాత్రి కను వింధ్యారాతి యేతెంచినం
దనయిల్లాండ్రునుఁ దాను నేమమున నానాపూజనల్ చేసి నూ
తనరత్నాసనమధ్యసీమమున నధ్యాసీనుఁ గావించి మె
ల్లన భద్రాశ్వనృపాలపుంగవుఁడు ఫాలన్యస్తహస్తాబ్జుఁడై.

5


క.

స్వామి యేసత్కర్మము, చే మోక్షప్రాభవంబు సిద్దించును మూ
ర్తామూర్తప్రతిపత్తుల, నేమిట శోకంబు లుడుగు నెఱిఁగింపు మనన్.

6


గీ.

ధరణినాథ మోక్షధర్మాఖ్య మైన యీ, ప్రశ్న మడుగఁ జెప్ప బ్రహ్మ కైన
నలవి గాదు చేరువై యుండు దవ్వగుఁ, గాన వచ్చి యుండుఁ గానరాదు.

7