పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యని పాదంబులును విలోమప్రకారంబునఁ బాదాదిగా ననులోమప్రకారంబున
నేతన్నామధేయంబులఁ బూజించి నారాయణాయ నమో యని సర్వాంగంబు
లఁ బుష్పాంజలి సమర్పించి తద్దేవతాగ్రభాగంబున మీనవ్రతంబువలెం గలశంబులు
నిలిపి మధ్యమకలశంబుమీఁద యోగనిద్రాముద్రితలోచనం బైన యథాశక్తి కనక
నిర్మితనారాయణప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు
చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునం గలశప్రతిమాదానంబులు గావించి
ధరణిబృందారకులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం
దాను భుజించిన నభీష్టఫలంబులు సిద్ధించు నిమ్మహావ్రతపుణ్యంబునఁ గృతార్థత్వం
బునం బొందినవారి వినుము.

107


గీ.

కనియె భరతు శకుంతల గనియెఁ గార్త, వీర్యు హైహయనామపృథ్వీధవుండు
కనియె మాంధాత యువనాశ్వజనవిభుండు, మఱియు రాజులు భాగ్యసంపన్ను లైరి.

108


సీ.

శరధినిమగ్నయై ధరణి గావించి వారిజనాభుచే నుద్ధరింపఁబడిన
కతన నీపండ్రెండువ్రతములు గూడంగ ధరణీవ్రతం బనఁ బరఁగె నీవ్ర
తములకుఁ గనకప్రతిమల దానము చేయ మత్స్యకూర్మాదినామముల మాస
నామంబులు వచించి నానాశ్రుతిపఠనపారంగతుం డైన బ్రాహ్మణునకు
నెంత విత్తంబు దా నిచ్చె నంతియఫల, మర్థవేదికి నిచ్చిన నందు రెట్టి
ఫలము పరతత్త్వ మెఱిఁగినపాంచరాత్ర, కునకు నర్పించిన సహస్రగుణఫలంబు.

109


సీ.

ఆకారసంపద గైకొని కనుపట్టుమోక్షలక్ష్మీకాంతమురువు గురువు
జ్ఞానవాసన వెదచల్లునిర్మలతపఃప్రమదవనీవాటిపరువు గురువు
క్రోధాదిసకలదుర్గుణములఁ బెడఁబాపుపరమశాంతిరసంబుకరువు గురువు
కరము విచిత్రంబుగా శాశ్వతైశ్వర్యగరిమంబు లేతెంచుతెరువు గురువు
దురితమృగశాబకములవాగురువు గురువు, నీపదాంబుజయుగళనిర్నిద్రభక్తి
నతిపరాయణశిష్యకామితఫలప్ర, దానమున మించునవకల్పతరువు గురువు.

110


వ.

కావున నవిద్యోవా సువిద్యోవా గురు రేవ జనార్ధన యనువాక్యంబు గలుగుటం
జేసి గురువులగుణదోషంబు లెంచినఁ బాతకంబు ప్రాపించు సంసారసాగరో
త్తారకుం డైనగురువుం బూజింపక పరిహరించి యితరులఁ జేపట్టుట పేరోడ విడిచి
వదరు వట్టుట యిట్లగుట యెఱింగి మొదల గురువుల సంభావించి తదనుమతం
బునఁ జేసిన దానాదికృత్యఁబులు సఫలంబు లగు నిమ్మహావ్రతంబు వినినఁ జదివిన
నిహపరసౌఖ్యంబులు గలుగు నని దూర్వాసుండు సత్యతపునకుం జెప్పె నని వరా
హదేవుండు చెప్పిన వసుమతి తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

111