పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

కృతయుగంబున నొకయేటఁ ద్రేత నాఱు, నెలల ద్వాపరమున నెలఁ గలుగు పుణ్య
ఫలము గలివేళ శ్రీవిష్ణుభక్తు లైన, విమలమతులకు దివసమాత్రమునఁ గలుగు.

99


క.

ఈవిధము నిశ్చయించియు, శ్రీవిష్ణుపదాబ్జభక్తి చేకొనమికి నే
భావంబులోన రోసి క, దా విశ్వము మోస పోయె నంటి నృపాలా.

100


క.

అని చెప్పిన భద్రాశ్వుఁడు, వినిపింపుము సులభ మైనవిష్ణువ్రత మ
న్న నగస్త్యమునీంద్రుఁడు మ, న్నన నానతి యిచ్చెఁ బద్మనాభవ్రతమున్.

101


సీ.

సత్యతపోమునీశ్వర యివ్విధంబునఁ దాఁ బద్మనాభవ్రతంబు చెప్పి
జననాథుఁ జూచి పుష్కరతీర్థమున వసించినకుమారస్వామిఁ గని భజించి
క్రమ్మఱ వత్తు నీకడకు నంచు నగస్త్యఋషికులోత్తంసుఁ డదృశ్యుఁ డైన
భార్యాయుతంబుగా భద్రాశ్వమేదినీపతియు నీపద్మనాభవ్రతంబు
చేసి విష్ణునికరుణావిశేషమున న, నేకసత్పుత్రపౌత్రాభివృద్ధి గాంచి
మఱియు గర్వాంధపరిపంథిమథనపటుభు, జాగ్రపీఠిక భరియించె నబ్ధికాంచి.

102


శా.

అంతం గార్తికశుక్లపక్షమున వింధ్యారాతి యేతెంచె భూ
కాంతుండు మునిసార్వభౌమునకు నర్ఘ్యం బిచ్చి మాణిక్యసౌ
ధాంతస్థాపితభద్రపీఠమున నధ్యాసీనుఁ గావించి శు
ద్ధాంతస్త్రీసహితంబు సవినయుండై మంజువాగ్వైఖరిన్.

103


గీ.

ఆశ్వయుజమాసమున భవదాజ్ఞ నేను, భక్తిఁ జేసితిఁ బద్మనాభవ్రతంబు
తాపసోత్తమ యిఁక నే వ్రతంబు కార్తి, కమునఁ జేయుదు ననవుడుఁ గలశభవుఁడు.

104


శా.

క్ష్మానాధా నయనీకృతేందురవితేజఃపుంజ మంతర్ముఖం
బై నైజోదరగుప్తలోకములు సాంద్రాలోకముల్ చేయ ల
క్ష్మీనారీహృదయేశ్వరుండు శయనించెన్ యోగనిద్రానుసం
ధానానందమునన్ మహాంబునిధిలో నారాయణాకారతన్.

105


గీ.

అట్టినారాయణునకుఁ బ్రియంబు గాఁగఁ, గార్తికంబున శుక్లపక్షమున దశమి
నాఁడు పూర్వప్రకారంబున నరుఁడు సము, చితవిధులు దీర్చి యేకాదశీదినమున.

106


వ.

స్నానాదికృత్యంబులు జరపి సౌభాగ్యలక్ష్మీకర్ణకుండలం బైనమంటపమండలంబున
శౌరి నారాధించి సహస్రశిరసే నమో యని శిరంబును బురుషాయ నమో యని భుజం
బులును విశ్వరూపిణే నమో యని కంఠంబును జ్ఞానాస్త్రాయ నమో యని శంఖ
చక్రంబులను శ్రీవత్సాయ నమో యని యురంబును జగత్ప్రసిష్ణవే నమో యని
యురంబును దివ్యమూర్తయే నమో యని కటీరంబును సహస్రపాదాయ నమో