పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోలెఁ గలశంబులు నిలిపి మధ్యమకలశంబుమీఁద సహిరణ్యగర్భనాభిబిసరుహం
బైన యథాశక్తి జాంబూనదనిర్మితపద్మనాభప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారం
బులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయంబునఁ గలశప్రతిమాదా
నంబులు గావించి తదనంతరంబున నిలానిలింపులకుఁ బాయసాహారంబు సదక్షిణం
బుగా నొసంగి భృత్యవర్గసహితుండై భుజియించినఁ గోరినకోర్కులు సిద్ధించు
నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము కృత
యుగంబునఁ దొమ్మిదివర్షంబులలో నొక్కవర్షంబునకుఁ దనపేర భద్రాశ్వవర్ష
నామధేయంబు గల్పించినభద్రాశ్వుండు భద్రాసనంబున భద్రగజగామినీకర
చమరవాలవాతూలకించిచ్చంచలచికురాంచలుఁడై మండలేశ్వరులు గొలువఁ గొలు
వున్నసమయంబున.

88


సీ.

సరిగా జగత్ప్రపంచముతోడ నొకవంకఁ దూనిక వచ్చినదొడ్డకపిలె
ప్రేమ రెట్టింప లోపాముద్రమోముదామరతావి గ్రోలుచుఁ దిరుగుతేఁటి
వానకాలంబుచే వండుపట్టినజలం బెల్లఁ దేర్పఁగఁ జాలుచిల్లగింజ
పరిపూర్ణకుంభగర్భం బనుశుక్తిలో మొనపినకట్టాణిముత్తియంబు
సింధురామాశుగము రోదసీకటాహ, కుహరపాటనపటుకూటకోటికోటి
వింధ్యనగబలిదైత్యత్రివిక్రమాంఘ్రి, ఋషికులాగ్రేసరుఁ డగస్త్యుఁ డేగుదెంచి.

89


శా.

ఆభాస్వత్కులమౌళిమండనముచే నర్ఘ్యాదిపూజల్ దయా
ర్ద్రీభావంబున నంది వైరిజలదశ్రేణీమహామాతరి
శ్వా భద్రాశ్వ పథశ్రమాపనయనేచ్ఛ న్నీనివాసాంతర
క్ష్మాభాగంబున నేడునాళ్ళు నిలువంగాఁ గోరి యేతెంచితిన్.

90


గీ.

అని తదీయానుమతి నుండి మునివరుండు, సవతు లేనూఱుగురుపరిచారికలవి
ధంబున భజింపఁగా నున్నధరణివిభుని, యింతిఁ గాంతిమతీదేవి నెదుటఁ గాంచి.

91


క.

ఒకదినమునఁ జేసినపూ, జకు మెచ్చి యితనికి నిట్టిసామ్రాజ్యము కొం
చక యిచ్చినహరి నెఱుఁగమి, నకటకటా మోసపోయె నఖిలజగంబుల్.

92


మ.

అరరే శౌరి బళీ ధ్రువుం డహహ భద్రాశ్వుండు వహ్వా తలో
దరి ప్రహ్లాదుఁడు మేలు బాపు మహిభర్తల్ విప్రు లౌరా వణి
గ్వరు లాహా కసుగాపు సాధు మదవద్వాతాపిదైతేయసం
హరణప్రౌఢిఁ బ్రసిద్ధుఁ డైనముని మఝ్ఝా యంచు నుద్బాహుఁడై.

93