పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని చెప్పిన సంతోషం, బున నాన్నగధరణిపాలపుంగవుఁ డరిగెన్
దనపురికి శిఖరమణికే, తునిరుద్ధాదిత్యరథచతుర్గోపురికిన్.

74


ఉ.

తొట్టినరోషవిస్ఫురణతో ధరణిం గలపక్కణస్థలుల్
బట్టబయిళ్ళుగా మెదడు వట్టినపాండుకపాలఖండముల్
గట్టినవెండినాళములకైవడి నంట ఖురాంచలంబుల
న్మట్టె నిషాదమస్తములు మారమణీరమణుండు కల్కియై.

75


గీ.

అట్టికల్కికిఁ బ్రియముగా నధికభక్తి, భాద్రపదమాసమున శుక్లపక్షదశమి
సముచితాచారములు పూర్వసరణిఁ దీర్చి, శిష్టవర్తనుం డేకాదశీదినమున.

76


వ.

స్నానాదికృత్యంబులు జరపి చతుర్ద్వారతోరణవిలోలబాలప్రవాళం బైనమంటప
గోళంబున రాత్రి పీతాంబరు నారాధించి కల్కినే నమో యని పాదంబులు హృషీ
కేశాయ నమో యని కటీరంబును మ్లేచ్ఛధ్వంసాయ నమో యని యూరుయు
గ్మంబును జగన్మూర్తయే నమో యని కంఠంబును ఖడ్గపాణయే నమో యని భుజంబు
లును విశ్వమూర్తయే నమో యని శిరంబునుం బూజించి తద్దేవతాగ్రభాగంబున సర
రత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునఁ దామ్రవైణవదారవంబులలోన
దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగళచ్ఛన్నం బైనయథాశక్తి జాతరూపకల్పితకల్కి
ప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు
సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబు గావించి తదనంతరంబ మేదినీ
దివిజులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం దానును భుజి
యించిన నరాతుల గెల్చి రాజభోగంబు లనుభవించి దేహావసానంబున విష్ణులో
కంబున నుండు నిమ్మహావ్రతాచరణంబున కొక్కయితిహాసంబు చెప్పెద నాక
ర్ణింపుము.

77


చ.

ప్రవిమలతత్వవాదనధురంధర మున్ను విశాలమేదినీ
ధవుఁడు సమస్తరాజ్యము నితాంతబలోద్ధతులై సగోత్రు లా
హవమున గెల్చి పుచ్చుకొన నాకులత న్నిజరాజధాని కా
శి వెడలి గంధమాదనము చేరి తదగ్రసరస్తటంబునన్.

78


గీ.

భక్తవత్సలు హరిగూర్చి ముక్తికన్య, కాలలామంబుచన్నులకరణిఁ బరిఢ
వించుపరిపక్వఫలముల విఱ్ఱవీఁగు, బదరికారణ్యవాటిఁ దపంబు సలుప.

79


క.

నరనారాయణు లనియెడు, పరమమునులు వచ్చి ధరణిపాలకులాగ్రే
సర వరము వేఁడు మన నా, నరనాథుఁడు వారిఁ జూచి నవ్వుమొగముతోన్.

80