పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భృత్యులుం దాను భుజియించినఁ బుత్రపౌత్రాభివృద్ధి గలిగి సామ్రాజ్యసుఖంబు
లనుభవించి శరీరంబు వీడ్కొని పెద్దకాలంబు పరమపదంబున నుండు నిమ్మహా
వ్రతాచరణంబునకు ఫలంబు శుద్ధోదనుండు జనార్దను నందనుంగాఁ బడసె మఱియు
నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

64


క.

నృగుఁ డనుధాత్రీపతి, మృగయార్థము వాహినీసమేతుండై పో
యి గహనభాగంబునఁ జం, పె గవయశార్దూలసింహభేరుండములన్.

65


గీ.

ఇట్లు చంపి చంపి యేకాకియై శర, భంబువెంటఁ బఱచి పఱచి డస్సి
వారువంబు నొక్కవసుమతీరుహమునఁ, గట్టి నీడ నొరగి కన్ను మొగిచె.

66


క.

ఆవేళం బదునాలుగు, వేవురు గొలువంగ వేఁటవెంబడి నొకభి
ల్లావనిపతి వచ్చుచు ని, ద్రావివశత నున్ననృగునిఁ దప్పక చూచెన్.

67


ఉ.

చూచి కిరాతులార బలుసొమ్ములు తెమ్మలు గాఁగ నబ్బె నీ
రాచకుమారు దోఁచుఁడు తురంగమరత్నముఁ బట్టుఁ డన్న న
న్నీచమనస్కు లొక్కొనొకనిం గడవం బఱతెంచి హస్తముల్
చాఁచఁ గడంగుచో నృగురసారమణీశ్వరుమేనిలోపలన్.

68


చ.

ఒకధవళాంగి భామిని సముద్భవమై కరవాలచక్రకా
ర్ముకగదలన్ భుజావలయముల్ గదలన్ మదభిల్లసైన్యమున్
సకలము నేలఁ గూల్చె మణిసానుమహాగుహ వెళ్ళి సింహశా
బకము నఖాంకురాగ్రముల భద్రగజంబుల వ్రచ్చుకైవడిన్.

69


క.

ఈరీతి శబరవీరుల, బారిసమరి మగుడఁ గైటభధ్వంసకమా
యారాజీవాక్షి నిజశ, రీరములోఁ జొచ్చువేళ నృగభూపతియున్.

70


క.

మేలుకొని తత్తరుణి నా, భీలాహవరంగపతితభిల్లభటులఁ దా
నాలోకించి సవిస్మయుఁ, డై లేచి సమీపజవనహరి నెక్కి వడిన్.

71


సీ.

పోయి తపోవనంబున నున్నవామదేవునకుఁ జాగిలి మహామునివరేణ్య
విను కాననమునఁ జల్లనిచెట్టునీడ నిద్రించి మేల్కని విలోకించ నాశ
రీరంబు చొచ్చె నారీరత్న మొకతె నిషాదులఁ బెక్కండ్రఁ జంపి తచ్చ
కోరాక్షి యెవ్వతె కూలినభిల్లు లెవ్వరు చెప్పు నావుడు వామదేవుఁ
డనియెఁ దొలిమేన శూద్రుండవై జనించి, ద్విజులపంపునఁ గావించితివి నృపాల
చంద్ర శ్రావణశుక్లపక్షంబునందు, ద్వాదశీతిథి బుద్ధవ్రతంబు నీవు.

72


గీ.

కాన నీమేన నుత్తమక్షత్రసంభ, వంబు రాజ్యరమావైభవంబు నిచ్చి
నడపినదియు నిషాదుల నఱకినదియు, దృఢము తద్వాదశీపుణ్యతిథియ సుమ్ము.

73