పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును బహ్మాండధారిణే నమో యని శిరం
బును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరి
స్థలంబునఁ దామ్రవైణవంబులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగళచ్ఛన్నం
బును దక్షిణహస్తవిన్యస్తపరశ్వధంబును నైనయథాశక్తి హేమనిర్మితజామదగ్నిప్రతి
మం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు
సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబును గావించి తదనంతరంబునఁ
సర్వంసహాసుపర్వులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం
దానును భుజియించినఁ బుత్త్రులం బుణ్యశ్లోకుల ననేకులం బడసి యిహలోక
సౌఖ్యంబు లనుభవించి కడపట నాబ్రహ్మకల్పంబు సత్యలోకంబున నప్సరస్త్రీ
సమూహంబు గొలువ నుండి చక్రవర్తియై జన్మించి ముప్పదెనిమిదివేలుసంవత్సరం
బులు బ్రదికె నిమ్మహావ్రతాచరణంబునకు నొకయితిహాసంబు చెప్పెద నాకర్ణిం
పుము.

42


సీ.

సత్యతపోమునీశ్వర వీరసేనభూపాలవర్యుఁడు పుమపత్యవాంఛ
నతిఘోరతపము చేయఁగ నచ్చటికి యాజ్ఞవల్క్యమహాయోగి వచ్చి రాజ
నీవు తపం బేల గావింపఁ గడఁగితి నావుడుఁ బుత్రసంతానలిప్స
నాచరించెద నన్న హరిహరి భయదాటవిస్థలి నీదురవస్థ పడక
జామదగ్నివ్రతము సల్పి చక్రవర్తి, యైనఘనకీర్తినిధిఁ గను మనిన నీవ్ర
తంబు గావించి కాంచె నిర్దళితఖలుని, బలవదరివీరవనదవానలుని నలుని.

43


చ.

తనశరలాఘవంబు బలదానవజిత్ప్రముఖాఖిలామరుల్
గనుఁగొని మెచ్చి యెల్లకడలం గురియించునభస్తరంగిణీ
కనకసరోజవృష్టి యనఁగాఁ దునిమెన్ సకిరీటరావణా
ననములు దూలి భూతలమునం బడ శ్రీహరి రామభద్రుఁడై.

44


గీ.

ఆదశరథాత్మజునకుఁ బ్రియంబు గాఁగ, సువ్రతుఁడు నిష్ఠతో జ్యేష్ఠశుద్ధదశమి
నాఁడు పూర్వప్రకారమున సకలసముచితవిధులు దీర్చి యేకాదశీదినమున.

45


వ.

స్నానాదికృత్యంబులు జరపి సంస్థాపితబహుప్రదీపమాలికాజనితపుష్పకమణీవ్రీడం
బైనమంటపక్రోడంబున రాత్రి జనార్దను నారాధించి దామోదరాయ నమో యని
పాదంబులు త్రివిక్రమాయ నమో యని కటీరంబును ధృతవిశ్వాయ నమో యని
యుదరంబును సంవత్సరాయ నమో యని యురంబును సంవర్తకాయ నమో
యని కంఠంబును సర్వాస్త్రధారిణే నమోయని భుజంబులు శంఖాయ నమో యని
శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును సహస్రశిరసే నమోయని శిరంబును