పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యని పాదంబులు గోవిందాయ నమో యని యుదరంబును విశ్వభుజాయ నమో
యని కటీరంబును ననిరుద్ధాయ నమో యని యురంబును శితికంఠాయ నమో యని
కంఠంబును పింగకేశాయ నమో యని శిరంబును దైత్యధ్వంసాయ నమో యని
చక్రంబును జలాత్మనే నమో యని శంఖంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున
సరత్నసలిలకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునఁ దామ్రదారువైణవంబులలోన
దొరకినపీఠంబుమీఁద ధవళవస్త్రయుగళంబునఁ బొదివి యథాశక్తి హిరణ్యనిర్మిత
నరసింహప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱు
నాఁడు సూర్యోదయావసరంబునం గలశప్రతిమాదానంబులు గావించి తదనంత
రంబ వసుధాసుధాంధసులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్య
సమేతుండై భుజియించిన మర్త్యభువనంబున సౌఖ్యంబు లనుభవించి పిదప విష్ణు
లోకంబున నుండు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద
నాకర్ణింపుము.

31


సీ.

మునికులోత్తంస కింపురుషవర్షంబునఁ బారశవ్యక్షమాపాలకుండు
వత్సరాజు విరోధివర్గంబుచేత రాజ్యము గోలుపోయి భార్యయును దానుఁ
జని వసిష్ఠాశ్రమంబునఁ గొంతకాలంబు వసియింపఁగా నొక్కవాసరమున
నవ్వసిష్ఠుడు నరాధీశ యిచటికి రా నీకు నేమి కారణము చెప్పు
మనిన జనభర్త ముకుళితహస్తుఁడై వి, పక్షులకు నాజిఁ దా నోటుపడిన తెఱఁగు
విన్నవించి మహాత్మ ప్రసన్నబుద్ధి, నొక్కగతి నాకుఁ జెప్పు నా నూఱడించి.

32


మ.

నరసింహవ్రత మాచరించి మను మన్నన్ వత్సభూజాని త
త్పరచిత్తంబున నేగి తద్వ్రతము సల్ప న్మెచ్చి చక్రంబు
హరి యీఁ గైకొని తన్మహాస్త్రమున మత్తారాతిరాజన్యకం
ధరముల్ సంగరసీమలో నఱకి శాంతస్వాంతుఁడై క్రమ్మఱన్.

33


క.

సామ్రాజ్యము పాలించె వి, నమ్రాఖిలకువలయాధినాథకిరీటా
తామ్రమణితరుణదినమణి, కమ్రవిభావికసితాంఘ్రికమలద్వయుఁడై.

34


మ.

తనరూపంబు గ్రమక్రమంబున దళద్బ్రహ్మాండభాండంబు నిం
డినచో భాస్కరుఁ డందెకు న్మొగపుమాణిక్యంబుగా సప్తవా
రినిధానీపరివేష్టితాఖిలధరిత్రీమానము ల్మీఱఁ బె
ట్టినపాదంబున దైత్యభేది బలి మెట్టెన్ వామనాకారుఁడై.

35


గీ.

మనుజుఁ డట్టివామనునికిఁ బ్రియంబుగాఁ, జైత్రశుద్ధదశమి సకలకర్మ
ములు మునుపటిచందమునఁ దీర్చి యేకాద, శీదినమున శుద్ధచిత్తవృత్తి.

36