పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

స్నానాదికృత్యంబులు జరపి సమంతతస్స్థాపితముకురకల్పితాపరిమితక్షణదేశం
బైనమంటపప్రదేశంబున నారాత్రి వామదేవు నారాధించి వరాహాయ నమో యని
పాదంబులు వామదేవాయ నమో యని కటీరంబును క్షేత్రజ్ఞాయ నమో యని జఠ
రంబును విశ్వరూపాయ నమో యని యురంబును సర్వజ్ఞాయ నమో యని కంఠం
బును బ్రజానాంపతయే నమో యని శిరంబును బ్రద్యుమ్నాయ నమో యని భుజం
బులు దివ్యాస్త్రాయ నమో యని చక్రంబును నమృతోద్ధాయ నమో యని శంఖం
బును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరి
స్థలంబున సౌవర్ధకాంస్యతామ్రవైణవంబులలోన దొరకినపాత్రంబున సకలసస్య
బీజంబులు నిండించి పెట్టి యథాశక్తి హేమంబునం గల్పించి ధవళవస్త్రయుగళంబు
నం బొదివి దంష్ట్రాసముత్తంభితవిశ్వంభరం బైనవరాహప్రతిమం బ్రతిష్ఠించి షోడ
శోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ
గలశప్రతిమాదానంబు గావించి తదనంతరంబున విప్రులకుఁ బాయసాహారంబు
సదక్షిణంబుగా నొసంగి భృత్యవర్గసహితుండై భుజించిన భూలోకంబున శాశ్వ
తైశ్వర్యంబు లనుభవించి పిదప వైకుంఠంబున నుండు నిమ్మహావ్రతంబున కొక్క
యితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

18


సీ.

శంసితవ్రతుఁ డైనసంవర్తసంయమీశ్వరునికుమారు లేవురు సమిత్కు
శార్థంబు చని భీకరారణ్యమున నప్పు డట జనియించినహరిణశాబ
ములఁ దల్లిఁ బాసి వాపోవుచుఁ గన్నులు దెఱవనివాని నైదింటిఁ జూచి
కరుణ నొక్కొకపిల్లఁ గరములఁ బట్టుమాత్రమున నామృగకిశోరములు చచ్చు
టయు భయంపడి జనకుని డాసి నిర్ని, మిత్తమున సంభవించిన మృగశిశువధ
పాతకము చెప్పి యిది మీరు పరిహరింప, వలయు నని విన్నవింప సంవర్తమునియు.

19


క.

మాతండ్రి మొదలఁ బాతకి, పాతకి నే నతనికంటె బాలకులారా
పాతకు లైతిరి మీరును, దాతతరముపాతకంబు తప్పక వచ్చెన్.

20


గీ.

అనుచు దుఃఖించి దైవికం బైనపనికి, నింక నేల విచారింప నేణచర్మ
ధారులై మీర లైదువత్సరము లడవిఁ, గ్రుమ్మరుఁడు మీఁదఁ బాపనిర్ముక్తి గలుగు.

21


చ.

అనవుడు నేణచర్మధరులై ఋషిపుత్రకు లేవురున్ వనం
బున నొకయేడుగాలము తపోనియతిన్ వసియింప నంత న
వ్వనవసుధాతలంబునకు వచ్చి కిరాతులు చొప్పు చూపఁగాఁ
బనివడి వీరసేనజనభర్త మృగంబుల వేఁట లాడుచున్.

22